సాధారణ స్థితి రావాలంటే.. అదొక్కటే మార్గం

సాధారణ స్థితి రావాలంటే.. అదొక్కటే మార్గం
  • త్వరగా వ్యాక్సిన్‌ కనుకోవాలి: యూఎన్ చీఫ్‌

యునైటెడ్‌ నేషన్స్‌: కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచం మొత్తం సాధారణ స్థితికి రావాలంటే వ్యాక్సిన్‌ కనుక్కోవడం ఒక్కటే మార్గం అని యూఎన్‌ చీఫ్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అన్నారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్‌ అని, ఈ ఏడాది చివరి నాటికి త్వరితగతిని దాన్ని కనిపెట్టాలని సూచించారు. ఐక్యరాజ్యసమితిలో భాగమైన సుమారు 50 ఆఫ్రికా దేశాలతో ఆంటోనియో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా ఈ విషయాలు చెప్పారు. “ కొవిడ్‌ –19కు సరైన వ్యాక్సిన్‌ కనుగొంటే ప్రపంచం మొత్తం తిరిగి మాములు స్థితికి చేరుకుంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి” అని ఆంటోనియో అన్నారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు 2 బిలియన్‌ డాలర్ల విరాళాలు ఇవ్వాలని రిక్వెస్ట్‌ చేస్తే, అందులో 20 శాతం మేర సేకరించామని చెప్పారు. 47 ఆఫ్రికన్‌ కంట్రీస్‌లో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్స్‌ ద్వారా ఐక్యరాజ్యసమితి కరోనా టెస్టులు చేస్తుందని చెప్పారు. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వివిధ దేశాలు తీసుకున్న చర్యలను ఆయన మెచ్చుకున్నారు. చైనాలో పుట్టిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు సగం దేశాలు లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార సంస్థలు మూడపడటంతో చాలా మంది రోడ్డున పడ్డారు.