- వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కారేపల్లి, వెలుగు: రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. మండల కేంద్రమైన కారేపల్లి జిన్నింగ్ మిల్లులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు శనివారం రాత్రి ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యను విన్నవించారు. తమ భూములకు న్యాయపరంగా రావాల్సిన నష్టపరిహారాన్ని అందేలా చూడాలని కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే ఫోన్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరితో ఫోన్లో మాట్లాడారు. రైతుల సమస్యలపై మరోసారి గ్రామసభను ఏర్పాటు చేయాలని కోరారు. సింగరేణి గ్రామం నాన్ ఏజెన్సీ అయినందున ఇక్కడి భూముల రేట్లకు తగ్గట్టుగానే పరిహారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం కంటే ముందు గేట్ కారేపల్లి లో మత్స్య సహకార సొసైటీ సభ్యులకు సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు.
