Buddha Purnima 2024:మే 23న ఆ చెట్టును పూజిస్తే .. దోషాల నుంచి విముక్తే.. ఎందుకంటే..

Buddha Purnima 2024:మే 23న ఆ చెట్టును పూజిస్తే .. దోషాల నుంచి విముక్తే.. ఎందుకంటే..

వైశాఖ పౌర్ణమికి ( మే 23)  హిందూమతంలో ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది వైశాఖ పూర్ణిమ గురువారం, మే 23 న వస్తుంది. ఈ రోజున నదీ స్నానానికి, దానాలకు ప్రాముఖ్యత ఉంది. వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

పురాణాల ప్రకారం, వైశాఖ పూర్ణిమ రోజున రావి చెట్టును పూజించడం చాలా మంచిది. ఈ రోజు రావి చెట్టును పూజించిన భక్తులకు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. పూర్వీకుల కూడా సంతోషిస్తారని చెబుతారు. హిందూ గ్రంధాల ప్రకారం, ఈ రోజున ఒక చెట్టును నాటడం వలన బృహస్పతి నుంచి ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి పొందుతారు.హిందూ మతంలో పౌర్ణమికి ప్రత్యేక అర్థం ఉంటుంది. మత గ్రంథాలలో, సంవత్సరంలోని పన్నెండు పన్నెండు పౌర్ణమి తిధులకు ప్రత్యేకత ఉంది. కానీ, వైశాఖ మాసంలో విష్ణువు తో పాటు రావి చెట్టును కూడా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే శ్రీ హరి రవి ఈ వృక్షంలోనే ఉంటాడని నమ్ముతారు. అందువల్ల, వైశాఖ పూర్ణిమ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే శని, బృహస్పతి గ్రహాల అనుకూలత ఉండాలి. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును పూజిస్తే శని, బృహస్పతుల అనుగ్రహంతో శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తారని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.

రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే

  • తెల్లవారుఝామునే నిద్ర లేచి రావి చెట్టుకు నీళ్లు పోసి, నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే రావి చెట్టులో నివసించే ముక్కోటి దేవతలు, బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సంతసించి పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు.
  • సూర్యోదయ సమయంలో రావి చెట్టుపై పితృదేవతలు నివసిస్తారట. అందుకే ఆ సమయంలో రావి చెట్టుకు నీళ్లు కలిపిన పాలు, నల్ల నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా పెడితే పితృదేవతల అనుగ్రహంతో సకల శ్రేయస్సు, వంశాభివృద్ధి కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
  • సూర్యోదయం తర్వాత రెండు ఘడియలు పూర్తయ్యాక రావి చెట్టులో శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుంది. ఆ సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆవు నేతితో దీపారాధన చేస్తే దారిద్య్ర బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.కనుక సూర్యోదయం తర్వాత రావి చెట్టును పూజించడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది.
  • సాధారణంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు శుభకార్యాలు విశేషంగా జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు మొదలుపెట్టే ముందు రావి చెట్టుకు పూజించి ప్రదక్షిణలు చేసిన తర్వాత శుభకార్యాలు ప్రారంభిస్తే కార్యాలలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి.
  • జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని అష్టమ శని వంటి దోషాలు ఉన్నట్లయితే సూర్యాస్తమయం సమయంలో రావి చెట్టుకు నీరు పోసి, నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.
  • వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు గంగా నదీ స్నానం చేస్తే విశేషమైన ఫలం ఉంటుంది. అలాగే ఈరోజు చేసే దానధర్మాలకు, పూజలకు మామూలు కన్నా కోటి రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రవచనం
  • వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును పూజించడం ద్వారా శని, బృహస్పతి, ఇతర గ్రహాలు కూడా జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయనే మత విశ్వాసం.
  • వైశాఖ పౌర్ణమి రోజున శుభ కార్యాలను చేస్తారు. తెల్లవారుజామున రావి చెట్టును పూజించిన తర్వాత రోజులో ఏ సమయంలోనైనా ఏదైనా శుభకార్యాలు చేయవచ్చు అనే నమ్మకం ఉంది.
  • ఎవరి జాతకంలో నైనా వితంతు యోగం ఉన్నట్లయితే ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేయడం ద్వారా వైధవ్య యోగం తొలగిపోతుందని నమ్ముతారు. ఇలా చేయడం ద్వారా విష్ణువు అశుభ ప్రభావాలను తొలగించి శుభాలను కలిగిస్తాడని విశ్వాసం.
  • వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించండి. దీని తరువాత చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల బృహస్పతి, శని శుభ ఫలితాలను ఇస్తారు. ప్రజలు జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.

వృక్షాలను దేవతా స్వరూపంగా భావించి పూజించడం హిందూ సంప్రదాయంలో భాగం. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ సమయంలో పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టుకు భక్తి పూర్వకమైన మనసుతో, సద్బుద్ధితో ఆచరించే పూజ మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మన పెద్దలు, జ్యోతిష శాస్త్రవేత్తలు సూచించిన పరిహారాలు పాటించి శుభఫలితాలను పొందుదాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. శుభం భుయాత్!