- నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తాలో అందరూ చూస్తుండగానే
- నరికి చంపిన వైష్ణవి అన్న
- పక్కా ప్లాన్తో దాడి చేసి కారులో పరార్
- భార్య హత్య కేసులో బెయిల్ పొంది తల్లితో ఉంటున్న హరిబాబు
- తానే చంపినట్టు వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియో రిలీజ్
నిజామాబాద్/జగిత్యాల/కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన ఆమె భర్త హరిబాబు (26) నిజామాబాద్ నగరంలో హత్యకు గురయ్యాడు. గురువారం సాయంత్రం ఆర్ఆర్ చౌరస్తాలోని షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట కారులో మరో ఇద్దరు వ్యక్తులతో వచ్చిన వైష్ణవి అన్న సంతోష్ కారు నుంచి దిగి కత్తితో హరిబాబును విచక్షణా రహితంగా పొడిచాడు. 10 సెకండ్ల వ్యవధిలో తొమ్మిది సార్లు పొడవగా.. హరిబాబు రక్తపుమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం ముగ్గురు కలిసి వచ్చిన కారులోనే పారిపోయారు.
నీళ్లు తాగేందుకు వెళ్లగా అటాక్
ఆరు నెలల క్రితం జరిగిన యూట్యూబర్ వైష్ణవి(19) మర్డర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న భర్త హరిబాబు నాలుగు నెలల గర్భిణి అయిన వైష్ణవిని ఈ ఏడాది మార్చి 17న హత్య చేసినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అదనపు కట్నం తేవాలని గొంతు నులిమి, కత్తితో పొడిచి హత్యచేసినట్టు కేసు నమోదు చేసిన పోలీసులు హరిబాబును జైలుకు పంపగా ఈ మధ్యే బెయిల్ పై బయటకు వచ్చాడు. నిజామాబాద్లోని ఇంద్రాపురంలో అద్దె ఇంట్లో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. మక్కబుట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం కూడా ఆర్ఆర్ చౌరస్తాలో మక్కబుట్టలు విక్రయిస్తూ దాహం వేయడంతో పక్కనే ఉన్న చాట్ బండి వద్దకు వెళ్లాడు. సరిగ్గా అదే టైంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి వైష్ణవి అన్న సంతోష్ షిష్ట్ డిజైర్ కారులో వచ్చాడు. అందులో నుంచి దిగి కత్తితో హరిబాబు తలపై పొడవగా అతడు కింద పడిపోయాడు. తర్వాత శరీరంలో పలుచోట్ల తొమ్మిది సార్లు పొడిచాడు. ప్రతిఘటించే వీలులేని స్థితిలో హరిబాబు కుప్పకూలాడు. వెంటనే ముగ్గురు వచ్చిన కారులోనే వేగంగా పారిపోయారు. ఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు వచ్చి డెడ్బాడీని జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి.. నిందితులను పట్టుకోడానికి సీపీ సాయిచైతన్య ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు.
హరిని నేనే చంపిన: సంతోష్
హరిబాబు హత్య అనంతరం గురువారం రాత్రి వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. హరిని తానే హత్య చేశానని.. తన చెల్లిని చంపినందుకు ప్రతీకారంగానే అతన్ని హత్యచేశానని తెలిపాడు. తాను పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్టు చెప్పాడు. వైష్ణవి హత్యోదంతం అప్పట్లో సంచలనం రేపగా నిందితుడైన భర్తను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వైష్ణవి హంతకులను చంపుతామని హెచ్చరిస్తూ ఆమె సోదరుల పేరుతో అప్పట్లో వీడియోలు వైరల్ అయ్యాయి.
