
- శాఖల వారీగా టార్గెట్లు ఖరారు
- నర్సరీల్లో పంపిణీకి రెడీగా మొక్కలు
- ఇండ్లలో పూలు, పండ్ల మొక్కల పంపిణీకి చర్యలు
- ఉమ్మడి జిల్లాలో 2.17 కోట్ల మొక్కలు నాటేలా లక్ష్యం
ఆసిఫాబాద్, వెలుగు: గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే లక్ష్యంతో వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పదో విడత వన మహోత్సవాన్ని చేపట్టేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో ఏపుగా పెరిగిన మొక్కలను పంపిణీకి రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 కోట్ల 17 లక్షల మొక్కలు నాటాలని ఆయా ప్రభుత్వ శాఖలకు టార్గెట్ కేటాయించారు.
ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో డీఆర్డీఏ, అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈనెల చివర్లో మొక్కలు నాటలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. వన మహోత్సవాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు దిశానిర్దేశం చేస్తున్నారు.
పలు శాఖల ఆధ్వర్యంలో..
ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల చివరిగా మొక్కలు నాటేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ప్రతి గ్రామంలో వన నర్సరీల ద్వారా పెరిగిన మొక్కలను అదే గ్రామంలో నాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాలు, తప్పిదాలు పునరావృత్తం కాకుండా అవసరమైన జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు. పదో విడత వన మహోత్సవంలో ఉమ్మడి జిల్లాలో 2 కోట్ల 16 లక్షల 98 వేల మొక్కలు నాటేందుకు ఆయా ప్రభుత్వ శాఖలకు టార్గెట్ విధించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 51 లక్షల 81 వేలు, ఆదిలాబాద్ లో 46 లక్షల 57 వేల 400, మంచిర్యాల జిల్లాలో 49 లక్షల 400, నిర్మల్ జిల్లాలో 69 లక్షల 55 వేల 300 మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. వీటిని నాటేందుకు ఫారెస్ట్, డీఆర్డీఏ, ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, పోలీస్, విద్య తదితర శాఖలకు టార్గెట్ నిర్దేశించి పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతీ ఇంటికి మొక్కల పంపిణీ
వన మహోత్సవంలో భాగంగా ప్రతీ ఇంటికి మొక్కలు పంచనున్నారు. ప్రజల ఇష్టం మేరకే వారికి నచ్చిన మొక్కలు అందజేయాలని భావిస్తున్నారు. గులాబీ, మందార, గన్నేరు, సీతాఫలం, జామ, ఉసిరి, అల్ల నేరేడు, మునగ, కానుగ, తులసితోపాటు ఈత, ఔషధ మొక్కలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్థలాలు, అటవీ ప్రాంతాలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాలు, హాస్పిటల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఆవరణల్లో విస్తృతంగా మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం జిల్లాని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాల సహకారం తీసుకోనున్నారు.
త్వరలో మొక్కలు నాటేందుకు చర్యలు
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆయా శాఖలకు టార్గెట్ ఇచ్చాం. నర్సరీల్లోని మొక్కలను పంపిణీకి సిద్ధం చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపడతం. నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున అందించేందుకు ప్రణాళిక రూపొందించాం. కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేస్తం. - దత్తరాం, డీఆర్డీఏ, ఆసిఫాబాద్