
- హోంశాఖ స్పెషల్ సీఎస్గా సీవీ ఆనంద్
- పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ
- సివిల్ సప్లయ్స్ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్
- ఇంటెలిజెన్స్ చీఫ్గా విజయ్కుమార్
- సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ఝాపై వేటు.. ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీగా నియామకం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ స్థానంలో ఉన్న సీవీ ఆనంద్ను హోంశాఖ స్పెషల్ సీఎస్గా బదిలీ చేసింది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా విజయ్కుమార్ను, పౌర సరఫరాల శాఖ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. శనివారం పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ రామకృష్ణారావు జారీ చేశారు. ఇందులో ఆరుగురు ఐఏఎస్ అధికారులు, 23 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. ఆమె సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కూడా చూడనున్నారు.
గత ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శిగా, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు చూస్తున్న రఘునందన్రావును ప్రభుత్వం బదిలీ చేసింది. కమర్షియల్ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రిజ్వీకి.. జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. రఘునందన్రావును కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా పోస్ట్ చేయడమే కాకుండా రవాణా శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ స్థానంలో ఉన్న కె.హరితను ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. కె.సురేంద్ర మోహన్ను వ్యవసాయ, సహకార శాఖ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయన కో-ఆపరేటివ్ సొసైటీల కమిషనర్, రిజిస్ట్రార్, మార్కెటింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు చూడనున్నారు.
సిరిసిల్ల కలెక్టర్ బదిలీ..
ఇటీవల ప్రొటోకాల్ ఇష్యూ వివాదాస్పదంగా మారడంతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీగా నియమించింది. ఎడ్యుకేషన్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఎం. హరితను రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా బదిలీ చేసింది. ఐపీఎస్లలో గ్రేహౌండ్స్ రోడ్ సేఫ్టీ అథారిటీ, సీజీజీ వైస్ చైర్మన్గా రవిగుప్తాను ప్రభుత్వం బదిలీపై పంపింది. ఏడీజీగా అనిల్ కుమార్, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ఫైర్ డీజీగా విక్రమ్సింగ్, హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు, హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్, వెస్ట్జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్కుమార్, నారాయణపేట ఎస్పీగా వినీత్, సీఐడీ చీఫ్గా వీవీ శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఏసీబీ డీజీగా చారుసిన్హాకు, ఎస్పీఎఫ్ డీజీగా స్వాతి లఖ్రాకు, ఏడీజీ పోలీసు పర్సనల్గా మహేశ్ భగవత్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా సింధు శర్మ, రాజేంద్రనగర్ డీసీపీగా యోగేశ్ గౌతమ్, మాదాపూర్ డీసీపీగా రితురాజ్ నియమితులయ్యారు.