‘వాహన్’ పోర్టల్ నిబంధనల మేరకే మార్పు అంటున్న రవాణా శాఖ
హైదరాబాద్, వెలుగు: వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీ)పై యజమానుల ఫొటోలు మాయమయ్యాయి. దశాబ్దానికిపైగా ఆర్సీలపై యజమానుల ఫొటోలు ఉండగా.. ఇప్పుడు ఒక్కసారిగా అవి లేకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ‘వాహన్’ పోర్టల్ నిబంధనల మేరకే ఈ మార్పు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్ర మోటార్ వెహికల్ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఏకీకృత విధానం తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రం ‘వాహన్’ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది.
గతేడాది తెలంగాణ రవాణా శాఖ ఈ పోర్టల్లో చేరింది. దీంతో రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించిన వ్యవహారాలన్నీ ‘వాహన్’ పోర్టల్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పోర్టల్ జారీ చేసే ఆర్సీలో యజమాని పేరు, అడ్రస్ మాత్రమే ఉంటున్నాయి కానీ ఫొటో ఉండడం లేదు.
ఫొటో లేకపోతే అక్రమాలకు చాన్స్
అయితే ఆర్సీలో ఫొటో లేకపోవడం వల్ల వాహనాల కొనుగోలు, విక్రయాలు, యాజమాన్య మార్పుల్లో అక్రమాలకు అవకాశం ఉంటుందని వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాలను బదిలీ చేసే సమయంలోనూ అక్రమాలు జరిగే చాన్స్ ఉందని అంటున్నారు. గతంలో వాహనం కొనుగోలు లేదా విక్రయం సమయంలో ఫొటోతో కూడిన ఆర్సీ కార్డు ఉండడంతో అసలైన యజమానిని సులభంగా గుర్తించేవారమని చెబుతున్నారు.
ఇప్పుడు ఫొటో లేకపోవడంతో వాహనం ఎవరిదో నిర్ధారించడం కష్టంగా మారిందని అంటున్నారు. దీంతో చోరీకి గురైన వాహనాలను ఇతరుల పేర్లపైకి బదిలీ చేసి సొమ్ము చేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాహనాలను కొనుగోలు చేసిన వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
