వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి హుండీని గురువారం లెక్కించారు. 12 రోజులకుగాను 1 కోటి 92 లక్షల 95 వేలు భక్తులు కానుకలుగా సమర్పించారు. బంగారం 69 గ్రాములు, వెండి ఐదున్నర కిలోలు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. మేడారం మహాజాతరకు ముందు వేములవాడకు భక్తులు రావడం ఆనవాయితీ. దీంతో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఆదాయం పెరిగినట్లు అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపును ఆలయ ఈఓ రమాదేవి, కరీంనగర్ ఏసీ ఆఫీస్ రాజమౌళి పర్యవేక్షణలో నిర్వహించారు. అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
