ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ కూరగాయల వ్యాపారి టమాటాలు కొనడానికి వచ్చే కస్టమర్లు నుంచి రక్షణ కోసం ఏకంగా బౌన్సర్లను నియమించుకున్నాడు. ప్రస్తుతం మార్కెట్ లో టమాటాలకు భారీ ధర ఉన్నందున ప్రజలు వాటిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని దీంతో రక్షణ కోసం ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్టుగా ఆ వ్యాపారి వెల్లడించాడు. ప్రస్తుతం మార్కెట్ లో కీలో టమాటా రూ. 160 ఉండగా కస్టమర్లు 50 నుంచి 100 గ్రాములు మాత్రమే కొంటున్నారని చెబుతున్నాడు.
టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో దొంగతనం జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇటీవల కర్ణాటకలోని ఒక పొలంలో రూ. 3 లక్షల విలువైన టమోటాలు దొంగిలించబడ్డాయని ఆరోపిస్తూ సోమశేఖర్ హళేబీడు అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హాసన్లోని హళేబీడు సమీపంలోని గోని సోమనహళ్లి గ్రామంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా సరఫరాలు తగ్గడంతో దేశవ్యాప్తంగా టమాటా ధరలు కిలోకు రూ. 162 వరకు పెరిగాయి.