హైదరాబాద్, వెలుగు: గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలని ఎన్ఎస్యూఐ స్టేట్ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయని, ఆ తర్వాత వెంటనే గ్రూప్–2 పరీక్ష నిర్వహించడం వల్ల అభ్యర్థులకు ఇబ్బందులొస్తాయని ఆయన పేర్కొన్నారు. గురుకుల ఎగ్జామ్ అయిపోయిన వారం రోజుల్లోపే గ్రూప్–2 పెట్టడం వల్ల ప్రిపరేషన్కు అభ్యర్థులకు టైం ఉండకుండా పోతుందని చెప్పారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు.
ఈ మేరకు తాము టీఎస్పీఎస్సీకి లేఖలు రాస్తామని చెప్పారు. పరీక్షను వాయిదా వేయాలన్న వారిపై ప్రభుత్వం కేసులు పెడుతూ బెదిరిస్తున్నదని ఫైర్అయ్యారు. మరోవైపు గురుకుల ఎగ్జామ్ సెంటర్లు అభ్యర్థులకు ఇబ్బందిగా మారాయని వెంకట్ ఆరోపించారు. 3 పేపర్లకు 3 సెంటర్లలో పరీక్షలు పెట్టడమేందని ఆయన ప్రశ్నించారు. గతంలో ఒకే సెంటర్ ఉండేదని, ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ పేరిట ఒకే అభ్యర్థికి మూడు సెంటర్లలో పరీక్షలు పెడుతున్నారని అన్నారు. మహిళా అభ్యర్థులు సహా అభ్యర్థులందరికీ ఈ విధానంతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని వాపోయారు. ఒకవేళ 3 సెంటర్లలో పరీక్షను నిర్వహించాలనుకుంటే కనీసం ఎగ్జామ్, ఎగ్జామ్కి మధ్య గ్యాప్నైనా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.