ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే వారి అభిమానులకు అది పండుగే. టాలీవుడ్లో అలాంటి క్రేజీ కాంబినేషనే చిరంజీవి, వెంకటేష్. చిరు హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ ఓ ఇంటరెస్టింగ్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.
గురువారం (అక్టోబర్ 23) నుంచి వెంకటేష్ సెట్స్లో జాయిన్ అయ్యారు. చిరంజీవి, వెంకటేష్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన వీడియోలో ‘వెల్కమ్ వెంకీ.. మై బ్రదర్ ’ అని చిరంజీవి అనగా, ‘చిరు సర్.. మై బాస్’ అని వెంకటేష్ చెప్పడం ఫ్యాన్స్కు ట్రీట్లా అనిపిస్తుంది. ఈ మూవీ సెట్లో పండగ వాతావరణం స్పష్టంగా తెలుస్తోంది. ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్తో అనిల్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో చిరుతో స్ర్కీన్ షేర్ చేసుకోవడం సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ సినిమాలో వెంకటేష్ లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ తెలియజేశారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
