
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఆరోపణలపై చర్చకు తాము సిద్ధమని, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి రెడీనా అని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి సవాల్ విసిరారు. జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సెక్రటేరియెట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్ రావు అన్ని పరిశ్రమలు, సాగుకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నారన్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, రాష్ట్రంలో 14 మెగావాట్స్ విద్యుత్ పెంచారని చెప్పారు. ఉద్యోగులపై రాజకీయ ఆరోపణలకు దిగడం దురదృష్టకరమని అన్నారు. అవినీతి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసని వేణుగోపాలచారి చెప్పారు.