పాతవాళ్లే ఉంటరా? కొత్త వాళ్లు వస్తరా?

పాతవాళ్లే ఉంటరా? కొత్త వాళ్లు వస్తరా?
  •  10 వర్సిటీల్లో నేటితో ముగియనున్న ఈవీసీల టర్మ్
  • కొత్త వీసీల నియామకానికి మరో వారం పట్టే చాన్స్  
  • ఇయ్యాల నిర్ణయం తీసుకోనున్న సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 10 సర్కార్ యూనివర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారంతో ముగియనున్నది. కొత్త వీసీల నియామకానికి మరో వారం, పది రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ప్రస్తుతం పని చేస్తున్న వీసీలనే కొనసాగిస్తారా? లేక వేరేవాళ్లకు ఇన్ చార్జులుగా బాధ్యతలు అప్పగిస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2021 మే 22న 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించారు. ఓయూ, కాకతీయ, జేఎన్టీయూ, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారంతో ముగియనున్నది. వీళ్ల పదవీకాలం ముగిసేలోపే కొత్త వాళ్లను నియమించాలని సర్కార్ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.

ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. కాకతీయ వర్సిటీ మినహా మిగిలిన 9 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలను కూడా సర్కార్ నియమించింది. రెండు మూడ్రోజుల్లో ఆయా కమిటీల సమావేశాలు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు. 

నేడు ప్రభుత్వ నిర్ణయం.. 

వీసీల నియామక ప్రక్రియ పూర్తికావడానికి వారం, పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అప్పటి దాకా ఇన్ చార్జ్ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొత్త వీసీలు వచ్చే వరకు వర్సిటీలకు ఇన్ చార్జులుగా ఐఏఎస్​లను నియమించాలనే ప్రపోజల్ సర్కార్ వద్ద ఉంది. అప్పటి వరకు ప్రస్తుతమున్న వారినే కొనసాగించాలనే ఆలోచనలో కూడా ఉంది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వీసీలను పక్కనపెట్టి, మిగిలిన వారిని కొనసాగించాలనే ప్రతిపాదన ఉంది. పాతవాళ్లను కొనసాగిస్తరా? లేక ఇన్ చార్జులను నియమిస్తరా? అనే దానిపై ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నది.