కూతురి ఫ్రెండ్‌ని రేప్‌ చేసి బ్లాక్‌మెయిల్: కళ్లలో గమ్ పోసి.. గొంతు కోసి చంపిన బాధితురాలు

కూతురి ఫ్రెండ్‌ని రేప్‌ చేసి బ్లాక్‌మెయిల్: కళ్లలో గమ్ పోసి.. గొంతు కోసి చంపిన బాధితురాలు

కూతురి వయసున్న అమ్మాయి (24).. తన బిడ్డ ఫ్రెండ్.. ఆమెతో కలిసి ఇంటికి వస్తుంటే తన బిడ్డలానే చూడాల్సింది పోయి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ వృద్ధుడు. ఆ విషయం బయటకు రాకుండా ఆ అమ్మాయి కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తూ వచ్చాడు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో గతంలో రేప్ చేసిన ఫొటోల్ని ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి తెగించి, అతడిని బయటకు పిలిచి గొంతు కోసి చంపేసింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది.

చెన్నైలోని తిరివొట్టియూర్ ప్రాంతానికి చెందిన శేఖర్ (54) అనే వృద్ధుడి ఇంటికి తన కుమార్తె స్నేహితురాలు (24) తరచూ వస్తుండేది. ఆ యువతిని శేఖర్ నాలుగేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. అయితే అతడు తన కుటుంబానికి ఆర్థికంగా సాయం చేస్తూ ఉండడంతో ఆ వృద్ధుడి చేష్టల్ని మౌనంగా భరించింది.

అయితే ఈ ఏడాది ఆమెకు పెళ్లి చేయాలని పేరెంట్స్ నిర్ణయించారు. ఈ విషయం శేఖర్‌కు చెప్పడంతో గతంలో వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడతానని ఆ అమ్మాయిని, వాళ్ల కుటుంబాన్ని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో అర్థంకాక,  అతడిని చంపేయాలని నిర్ణయించుకుంది ఆ యువతి. సోమవారం వాషర్‌మెన్‌పేట్‌లోని  ఓ ప్లే గ్రౌండ్‌కు పిలిచింది. నెమ్మదిగా అతడి కళ్లలో గమ్ పోసి.. కత్తితో గొంతు కోసి చంపేసింది.

గ్రౌండ్‌లో డెడ్ బాడీని చూసిన స్థానికులు.. పోలీసులు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు… శేఖర్ స్నేహితులు, బంధువుల్ని విచారించారు. ఈ సమయంలో అతడి స్నేహితుడొకరు ఆ అమ్మాయితో శేఖర్ రిలేషన్ గురించి చెప్పాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ప్రశ్నించగా తానే నేరం చేసినట్లు పోలీసుల దగ్గర ఒప్పుకుంది.