
హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కారు ప్రమాదంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించాడు రౌడీ బాయ్. రోడ్డు ప్రమాదంలో కేవలం కారు దెబ్బతిన్నదని.. తామంతా క్షేమంగానే ఉన్నామని క్లారిటీ ఇచ్చాడు. జిమ్కు కూడా వెళ్లి వచ్చానని తెలిపాడు. తనకు ప్రమాదం జరిగిందన్న వార్తలతో ఎవరూ ఆందోళన చెందొద్దని ఫ్యాన్స్కు సూచించాడు.
హీరో విజయ్ దేవరకొండ కారుకు సోమవారం (అక్టోబర్ 6) ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి దగ్గర ముందు వెళ్తోన్న బొలెరో వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో విజయ్ కారు ఢీ కొట్టింది. దీంతో విజయ్ కారు పాక్షికంగా దెబ్బతింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ పుట్టపర్తి వెళ్లి తిరిగి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
విజయ్ అక్టోబర్ 5న పుట్టపర్తిని దర్శించుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేటపుడు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి శివారులోని వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గరకు రాగానే విజయ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై విజయ్ దేవర కొండ డ్రైవర్ అందే శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఘటన తర్వాత విజయ్ దేవరకొండ మరో కారులో హైదరాబాద్కు వెళ్లారు.