విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్ కు వెళ్లిన నాలుగు జట్లేవో తెలిసిపోయింది. మంగళవారం (జనవరి 13) కర్ణాటక, సౌరాష్ట్ర సెమీస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం (జనవరి 13) మరో రెండు జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. మధ్య ప్రదేశ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంజాబ్ భారీ విజయం సాధించింది. బెంగళూరు వేదికగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1 లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఏకంగా 183 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. ప్రబు సిమ్రాన్ సింగ్ 88 పరుగులు చేసి టప స్కోరర్ గా నిలిచాడు.
అల్మొప్రీత్ సింగ్ (70), నేహాల్ వధేరా (56) హాఫ్ సెంచరీలు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్ష్య ఛేదనలో మధ్య ప్రదేశ్ కేవలం 162 పరుగులకే ఆలౌటైంది. చివరి క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీపై విదర్భ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. యాష్ రాథోడు 86 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అథర్వ తైడే (62) హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 224 పరుగులకే ఆలౌటైంది. అనుజ్ రావత్ 66 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.
సెమీస్ షెడ్యూల్:
తొలి సెమీ ఫైనల్ : కర్ణాటక vs విదర్భ: గురువారం (జనవరి 15)
రెండో సెమీ ఫైనల్: పంజాబ్ vs సౌరాష్ట్ర: శుక్రవారం (జనవరి 16)
ఫైనల్ : ఆదివారం (జనవరి 18)
సెమీస్ కు సౌరాష్ట్ర:
కెప్టెన్ హర్విక్ దేశాయ్ (100 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో.. విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర సెమీస్లోకి అడుగుపెట్టింది. ప్రేరక్ మన్కడ్ (67), చిరాగ్ జైన్ (40 నాటౌట్) బ్యాట్లు ఝుళిపించడంతో.. సోమవారం జరిగిన రెండో క్వార్టర్ఫైనల్లో సౌరాష్ట్ర 17 రన్స్ తేడాతో (వీజేడీ పద్ధతి) ఉత్తరప్రదేశ్పై గెలిచింది. టాస్ ఓడిన యూపీ 50 ఓవర్లలో 310/8 స్కోరు చేసింది.
అభిషేక్ గోస్వామి (88), సమీర్ రిజ్వి (88), ప్రియమ్ గార్గ్ (35), ప్రశాంత్ వీర్ (30) రాణించారు. చేతన్ సకారియా 3, అంకూర్ పన్వర్, ప్రేరక్ మన్కడ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 238/3 స్కోరు చేసింది. ఈ దశలో వర్షం వల్ల మ్యాచ్కు అంతరాయం కలిగింది. అప్పటికే వీజేడీ పద్ధతిలో సౌరాష్ట్ర ఎక్కువ స్కోరు చేసి ఉండటంతో విజేతగా ప్రటించారు.
వరుసగా నాలుగో సారి సెమీస్ కు కర్ణాటక:
ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న డిఫెండింగ్ చాంపియన్ కర్నాటక.. వరుసగా నాలుగోసారి విజయ్ హజారే ట్రోఫీ సెమీస్లోకి ప్రవేశించింది. ఛేజింగ్లో దేవదత్ పడిక్కల్ (81 నాటౌట్), కరుణ్ నాయర్ (74 నాటౌట్) దంచికొట్టడంతో.. సోమవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో కర్నాటక 55 రన్స్ తేడాతో (వీజేడీ పద్ధతి) ముంబైపై నెగ్గింది. టాస్ ఓడిన ముంబై 50 ఓవర్లలో 254/8 స్కోరు చేసింది. శామ్స్ ములానీ (86) టాప్ స్కోరర్. సిద్ధేశ్ లాడ్ (38), సాయిరాజ్ పాటిల్ (33 నాటౌట్), అంగ్క్రిష్ రఘువంశీ (27), ఇషాన్ మూల్చందానీ (20) రాణించారు.
