
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇన్ చార్జి విజయ్ నాయర్కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపు అడ్వొకేట్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం కొట్టివేసింది. నిందితుడు నాయర్ రెండేళ్లుగా ఈ కేసులో కస్టడీలో ఉన్నాడని బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్ వేయాలని గత నెల 12న ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాయర్ తరపున సీనియర్ అడ్వొకేట్లు అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌధురి వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నాయర్ను 2022 నవంబరు 13న అరెస్టు చేశారని, ఆయన బెయిల్ దరఖాస్తును ట్రయల్ కోర్టు కొట్టివేయగా సవాలు చేశారని గత నెల 12న వారు కోర్టుకు తెలిపారు.