జీడిమెట్ల, వెలుగు: స్కీముల పేరులో కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు దండుకుంటున్నదని మాజీ ఎంపీ, బీజేపీ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఫైరయ్యారు. ప్రజలపై కేసీఆర్కు ఎలాంటి ప్రేమ లేదని, ఆనాడు కేవలం పదవి రాకపోవడంతోనే టీఆర్ఎస్ పార్టీ పెట్టాడన్నారు. అందరి పోరాటంతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే రాజ్యమేలుతున్నదన్నారు. పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా కుత్బుల్లాపూర్ సర్కిల్ మున్సిపల్ ఆఫీస్ వద్ద సోమవారం మహాధర్నా చేపట్టింది. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలేవీ ప్రజల కోసం కాదని, ఆయన కుటుంబం కోట్లు సంపాదించడం కోసమేనని విమర్శించారు. కేసీఆర్ను దించడం కోసం, తమ హక్కుల కోసం తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నియోజకవర్గానికి లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని మాయమాటలు చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజల సొమ్మును పంచుతున్నాడని మండిపడ్డారు. 90 రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీసులో బైఠాయింపు
మహాధర్నా అనంతరం విజయశాంతితోపాటు బీజేపీ నాయకులు కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ మంగతాయారుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆమె అందుబాటులో లేరు. దీంతో విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. ఆమె వచ్చే వరకు ఇక్కడే ఉంటామంటూ బైఠాయించారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు 45 నిమిషాల తర్వాత డిప్యూటీ కమిషనర్ రావడంతో ఆమెకు వినతి పత్రం అందజేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్రాజు, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, జిల్లా అధ్యక్షుడు హరీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.