- కాంగ్రెస్లోకి విజయశాంతి
- పార్టీ చీఫ్ ఖర్గే సమక్షంలో చేరిక
- మేనిఫెస్టో సభలో కాంగ్రెస్లో చేరిన మందా జగన్నాథం
హైదరాబాద్, వెలుగు: ఇటీవల బీజేపీకి రాజీ నామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్ తాజ్కృష్ణ హోటల్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడం సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తున్నదని విజయశాంతి అన్నారు. అన్ని విషయాలు శనివారం ప్రెస్మీట్లో చెప్తానని తెలిపారు.
2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి.. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు 2009లో టీఆర్ఎస్లో విలీనం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచారు. అనంతరం ఆమెను కేసీఆర్ పక్కనపెట్టడంతో 2014లో కాంగ్రెస్లో చేరారు. కొన్నాళ్ల పాటు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేశారు. అయితే, అక్కడ తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ 2020లో బీజేపీలో చేరారు. బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. అయితే, ఇటీవలి రాజకీయ పరిణామాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకి అయిన కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై అభ్యంతరం చెప్పారు.
కొన్నాళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసి.. శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం కూడా ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం గాంధీభవన్లో మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.