వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం జగన్
విజయవాడ: రోజు రోజుకూ పెరుగుతున్న నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇద్దరూ కలసి శుక్రవారం వర్చువల్ కార్యక్రమం ద్వారా ఫ్లైఓవర్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్లు జాతికి అంకితం ఇచ్చారు. కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కిలోమీటర్ల మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900 పని దినాలలో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది.. కరోనా.. అన్ లాక్ వల్ల ప్రారంభోత్సవం తేదీ పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ముహూర్తం కుదిరి.. ఇవాళ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.