విజయవాడ దుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రారంభం ఎట్టకేలకు రేపు(శుక్రవారం) జరగనుంది. ఎన్నోరోజులుగా వాయిదాలు పడుతూ వస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లై ఓవర్ ను వర్చువల్ గా శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. వర్చువల్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. దీంతో పాటు మొత్తం 61 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంఖుస్ధాపనలు కూడా ఇదే ముహుర్తానికి జరగనున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నితిన్ గడ్కరీ ఢిల్లీ నుంచి, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి గడ్కరీ నేరుగా రావాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని వర్చువల్ మోడ్లోనే ప్రారంభించేందుకు గడ్కరీ, జగన్ అంగీకరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ రాష్ట్రంలోనే అతి పెద్ద పైవంతెన కానుంది.
ఫ్లైఓవర్ ప్రారంభ కార్యక్రమం ఓసారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి సంతాప దినాల కారణంగా, మరోసారి గడ్కరీకి కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.