పరిగి, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల వేళ ఓ గ్రామంలో ప్రతీ ఇంటి ముందు ఆవాలు కనిపించడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఎన్కేపల్లి గ్రామంలో సోమవారం ఓటర్ల ఇంటి గుమ్మం వద్ద తెల్ల ఆవాలు కనిపించాయి. దీంతో ఊరంతా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఆవాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రచారం చేసిన వారు ఓట్ల కోసం మంత్రించిన ఆవాలను చల్లుతున్నారనే ఆరపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వనజ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ప్రియారెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఆవాలు చల్లడంపై వీరిద్దరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్గం పనేనని కాంగ్రెస్ నాయకులు అంటుండగా, కాంగ్రెస్ వాళ్లే చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
