వికారాబాద్, గండిపేట్ వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని, సేవలను తెలంగాణ ఎప్పటికీ మరిచిపోదని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఆదివారం ప్రొ.జయశంకర్ జయంతి కార్యక్రమంలో ఆయన ఫొటోకు జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు వెళ్లాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్ అన్నారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఔట్ డోర్ డిప్యూటీ డైరెక్టర్ పి.శ్రీరామమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అకాడమీలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్ద ఉన్న జయశంకర్ విగ్రహానికి రిజిస్ట్రార్ ఎం.వెంకటరమణ, విశ్వవిద్యాలయ అధికారులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.