పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్​ లాస్ట్

పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్​ లాస్ట్
  • 40 శాతం మంది స్టూడెంట్లు ఫెయిల్​
  • మేడ్చల్ జిల్లా 14, రంగారెడ్డి 20, హైదరాబాద్​ 28వ స్థానం
  • కిందటేడుతో పోలిస్తే హైదరాబాద్, మేడ్చల్​జిల్లాల్లో పెరిగిన పాస్ పర్సంటేజ్

హైదరాబాద్/రంగారెడ్డి/పరిగి, వెలుగు: 
పదో తరగతి ఫలితాల్లో 59.46 పాస్​పర్సంటేజ్​తో వికారాబాద్ ​జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. 99 పాస్​ పర్సంటేజ్​తో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వికారాబాద్​ జిల్లాలో గతేడాది 90.42 శాతం మంది స్టూడెంట్లు పాస్ ​అవగా, ఈసారి 60 శాతానికి మించి కాలేకపోయారు. అలాగే 90.72శాతంతో మేడ్చల్-– మల్కాజిగిరి జిల్లా 14వ స్థానం, 87.25 శాతంతో రంగారెడ్డి జిల్లా 20వ స్థానం, 80.29 శాతంతో హైదరాబాద్​జిల్లా 28వ స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి జిల్లాలో గతేడాది 90.04 శాతం మంది స్టూడెంట్లు పాస్ అవగా, ఈసారి ఆ పర్సంటేజ్ తగ్గింది. హైదరాబాద్ జిల్లాలో 0.66 శాతం, మేడ్చల్-– మల్కాజిగిరి జిల్లాలో 4.41 శాతం పెరిగింది. 

హైదరాబాద్ ​జిల్లాలో..

హైదరాబాద్​జిల్లా వ్యాప్తంగా 98,468 మంది స్టూడెంట్లు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. ఇందులో 35,376 మంది అమ్మాయిలు, 33,092 మంది అబ్బాయిలు ఉన్నారు. మొత్తం 54,971 మంది పాస్​అవగా, వీరిలో 29,638 మంది అమ్మాయిలు, 25,333 మంది అబ్బాయిలు ఉన్నారు. అలాగే జిల్లాలోని 9 గవర్నమెంట్ ​స్కూళ్లలో 100 శాతం పాస్​ అయ్యారు. జిల్లాలోని గవర్నమెంట్, ప్రైవేట్​స్కూళ్లలో కలిపి 577 మంది 10/10 జీపీఏ సాధించారు. 

రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లాలో మొత్తం 47,551 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్​ రాశారు. వీరిలో 24,444 మంది అబ్బాయిలు, 23,107 మంది అమ్మాయిలు ఉన్నారు. మొత్తంగా 41,488 మంది పాస్​అయ్యారు. వీరిలో అబ్బాయిలు 20,825, అమ్మాయిలు 20,663 మంది ఉన్నారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివిన 47 మంది స్టూడెంట్లు, ప్రైవేట్​స్కూళ్లలో చదివిన 927 మంది స్టూడెంట్లు 10/10 జీపీఏ సాధించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌ జడ్పీహెచ్ఎస్ స్టూడెంట్ గోదల నిమ్మి 10/10 జీపీఏ సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్వీట్లు తినిపించి అభినందించారు. 

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో..

మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 43,319 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్​రాశారు. వీరిలో 22,224 మంది అబ్బాయిలు, 21,095 మంది అమ్మాయిలు ఉన్నారు. మొత్తంగా 39,299 మంది పాస్​అయ్యారు. వీరిలో అబ్బాయిలు 19,802, అమ్మాయిలు 19,497 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,099 మంది స్టూడెంట్స్ 10/10 జీపీఏ సాధించారు.

వికారాబాద్ జిల్లాలో..

మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 13,399 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్​రాశారు. వీరిలో 6,759 మంది అబ్బాయిలు, 6,640 మంది అమ్మాయిలు ఉన్నారు. మొత్తంగా 7,967 మంది మాత్రమే పాస్​అయ్యారు. వీరిలో అబ్బాయిలు 3,643, అమ్మాయిలు 4,324 మంది ఉన్నారు. 32 మంది స్టూడెంట్లు 10/10 జీపీఏ సాధించారు. ఇంత దారుణమైన ఫలితాలు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైమరీ స్కూళ్లలోని టీచర్లతో హైస్కూల్​స్టూడెంట్లకు క్లాసులు చెప్పించడంతో పాస్​పర్సంటేజ్​దారుణంగా పడిపోయిందంటున్నారు. జిల్లాలో మొత్తం 305 హైస్కూళ్లు ఉండగా 95 స్కూళ్లకు పర్మినెంట్​హెడ్​మాస్టార్లు లేరు. 300 స్కూల్​అసిస్టెంట్​పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. సరిపడా టీచర్లు లేకనే 40 శాతం మంది పిల్లలు ఫెయిల్​అయ్యారని వికారాబాద్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్​ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

అన్ని స్కూళ్లలో హెచ్ఎంలు లేకనే..

టెన్త్​ ఫలితాల్లో చివరి స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం జిల్లా మొత్తం గ్రామీణ ప్రాంతం కావడం. అన్ని ఊళ్లలో హైస్కూళ్లు అందుబాటులో లేవు. స్టూడెంట్లు ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లి చదువుకోవాల్సి రావడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడింది. సరిపడా స్టాఫ్​ లేక, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైమరీ స్కూళ్లలోని సిబ్బందితో క్లాసులు చెప్పించాం. స్కూళ్ల నిర్వహణ తీరు చూసుకునేందుకు అన్ని హైస్కూల్లో హెచ్ఎంలు లేరు. ఫలితాలపై ఈ సమస్య కూడా కొంత ప్రభావం చూపించింది.
– రేణుక, వికారాబాద్ డీఈఓ