
- దుర్వాసన భరించలేకపోతున్నాం
- మరియా ఫీడ్ ఫ్యాక్టరీని తరలించండి
- వికారాబాద్ జిల్లా దోర్నాల్ గ్రామస్తుల ఆందోళన
- కళేబరాల లారీని అడ్డుకుని ఆందోళన
వికారాబాద్, వెలుగు: మరియా ఫీడ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నామని, ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలంటూ వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని దోర్నాల్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దుర్వాసన భరించలేక ఫ్యాక్టరీకి తరలించే పశు కాళేబరాల వాహనాలను సోమవారం రాత్రి అడ్డుకున్నారు. ఆ ఫ్యాక్టరీలో పశు కళేబరాల (బొక్కల)నుంచి బిర్యానీలోకి వాడే నూనె, కోళ్ల, చేపల దాణా, సెంట్లోకి లిక్విడ్తయారు చేస్తున్నారని ఆరోపించారు. తమకు దుర్వాసన వస్తున్నా కొందరు ఆ ఫ్యాక్టరీకి వత్తాసు పలుకుతున్నారని, వారి ఇంటి దగ్గరలో ఆ కళేబరాలు వాహనాలను నిలిపేసి నిరసన తెలిపారు. సోమవారం రాత్రి నుంచి వాహనాలు గ్రామంలో నిలిపివేయడంతో గ్రామమంతా కంపుతో నిండిపోయింది. మంగళవారం ఉదయం గ్రామంలోని శివాజీ విగ్రహం వద్ద రోడ్డుపై అడ్డంగా వాహనాలను పెట్టి బైఠాయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి అందరూ అనారోగ్యం భారిన పడుతున్నారని, పశువులు,కోళ్లు చనిపోతున్నాయన్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ఆర్డీవో వాసుచంద్ర, డీఎస్పీలు శ్రీనివాస్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, అక్కడికి వచ్చి గ్రామస్తులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, నిత్యం తాము కంపు కంపు మధ్య బతుకుతున్నామని, అధికారులు కూడా కంపు భరించాల్సిందే అని ప్రజలు మంకుపట్టు పట్టుకొని కూర్చున్నారు. కంపెనీని మూసివెయ్యాలని పట్టుపట్టడంతో పీసీబీ ఏఈఎస్ సుదర్శన్, ఏఈఈ శరత్ అక్కడికి వచ్చారు. పరిశీలన జరిపి కంపెనీని సీజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.