
- స్కూల్ అభివృద్ధికి సొంతంగా గ్రామస్తుల నిధుల సేకరణ
- పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు వక్తలు
కామారెడ్డి, వెలుగు: గవర్నమెంట్స్కూల్ను సొంత నిధులతో అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు వచ్చిన ఫరీద్ పేట్ గ్రామస్తుల స్ఫూర్తి అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం పాల్వంచ మండలం ఫరీద్ పేట్ ప్రభుత్వ హై స్కూల్పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రభుత్వ నిధులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థుల సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ సలహదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ఎంపీ సురేశ్ షెట్కార్, రెరా చైర్మన్డాక్టర్సత్యనారాయణ, పారిశ్రామికవేత్త సుభాశ్ రెడ్డి, డాక్టర్వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడిని అభివృద్ధి చేసుకోవడానికి పూర్వ విద్యార్థులతో పాటు గ్రామస్తులు ముందుకు వచ్చారన్నారు.
వీళ్లను స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామస్తులు కూడా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్అలీ మాట్లాడుతూ.. ఫరీద్ పేట్ పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారన్నారు. బాధ్యతగా గ్రామస్తులు అందరూ కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా చూడాలన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా సంస్థలతో చేతులు కలుపుకొని ప్రభుత్వ విద్యా సంస్థలను భ్రష్టు పట్టించాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతినిధులు రమేశ్ గౌడ్, డాక్టర్ శంకర్, కొంగల వెంకటి, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.