ఫరీద్ పేట్ గ్రామస్తుల స్ఫూర్తి అభినందనీయం

ఫరీద్ పేట్ గ్రామస్తుల స్ఫూర్తి అభినందనీయం
  •  స్కూల్ అభివృద్ధికి సొంతంగా గ్రామస్తుల నిధుల సేకరణ 
  • పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు వక్తలు 

కామారెడ్డి, వెలుగు:  గవర్నమెంట్​స్కూల్‌ను సొంత నిధులతో అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు వచ్చిన ఫరీద్‌ పేట్ గ్రామస్తుల స్ఫూర్తి అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం పాల్వంచ మండలం ఫరీద్ పేట్ ప్రభుత్వ హై స్కూల్​పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.  ప్రభుత్వ నిధులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థుల సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.  ఇందులో ప్రభుత్వ  సలహదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్​ఎంపీ సురేశ్​ షెట్కార్, రెరా చైర్మన్​డాక్టర్​సత్యనారాయణ, పారిశ్రామికవేత్త సుభాశ్ రెడ్డి,​ డాక్టర్​వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు.  ప్రభుత్వ బడిని అభివృద్ధి చేసుకోవడానికి పూర్వ విద్యార్థులతో  పాటు గ్రామస్తులు ముందుకు వచ్చారన్నారు.

 వీళ్లను స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామస్తులు కూడా ముందుకు రావాలన్నారు.  ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్​అలీ మాట్లాడుతూ..  ఫరీద్​ పేట్‌ పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారన్నారు.  బాధ్యతగా గ్రామస్తులు అందరూ కలిసి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా చూడాలన్నారు. జహీరాబాద్​ ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ..  గత ప్రభుత్వాలు ప్రైవేట్​ విద్యా సంస్థలతో చేతులు కలుపుకొని ప్రభుత్వ విద్యా సంస్థలను భ్రష్టు పట్టించాయని విమర్శించారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.  ప్రతినిధులు రమేశ్ గౌడ్, డాక్టర్ శంకర్, కొంగల వెంకటి, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.