- గ్రామంలోనే చదివించాలె
- కన్నాపూర్ గ్రామస్తుల తీర్మానం
జగిత్యాల రూరల్, వెలుగు: మూతపడుతున్న సర్కారు స్కూల్ ని బతికించుకునేందుకు ఆ గ్రామస్తులు నడుం కట్టారు. ఈ ఏడాది మూతపడాల్సిన స్కూల్కు ఊరంతా కలిసి జీవం పోశారు. ఊళ్లో పిల్లలను సర్కారు స్కూళ్లోనే చదివించాలని శుక్రవారం గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. ఎవరైనా ప్రైవేట్ స్కూల్కు పంపింతే పంచాయతీ తరఫున ఇచ్చే ధ్రువపత్రాలను సైతం ఇవ్వమని నోటీసులు అంటించారు. గ్రామ పంచాయతీ తీర్మానంతో మూతపడే స్కూల్ ఇప్పుడు కళకళలాడుతోంది. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం కన్నాపూర్ గ్రామంలో ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఆరుగురు టీచర్లు, కేవలం ఐదుగురు స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం స్కూల్ మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులంతా ఏకమై గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకున్నారు. ఊళ్లో పిల్లలను ఊళ్లోనే చదివించాలని నిర్ణయించారు. ఐదుగురు స్టూడెంట్స్ఉన్న స్కూళ్లో ఇప్పుడు 40 మంది చేరారు. గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులు కూడా మద్దతు పలికారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి మరింత మందిని చేర్పిస్తున్నారు.
మరింత మందిని చేర్పిస్తాం
స్కూళ్లల్లో స్టూడెంట్స్ లేకపోవడంతో స్కూల్స్ మూసి వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దిన స్కూల్ మూతపడే పరిస్థితి వచ్చింది. గ్రామస్తులంతా కలిసి ఎలాగైన పిల్లలందరిని సర్కార్స్కూళ్లో చదివించాలని నిర్ణయం తీసుకున్నాం. మరింత మందిని చేర్పించేందుకు కృషి చేస్తున్నాం. – సుధాకర్, సర్పంచ్, కన్నాపూర్, జగిత్యాల రూరల్మండలం.