భూములు కోల్పోయిన వారి నోళ్లలో మట్టికొట్టిన్రు: భూనిర్వాసితులు

భూములు కోల్పోయిన వారి నోళ్లలో మట్టికొట్టిన్రు: భూనిర్వాసితులు

వెలుగు, చెన్నూర్: చెన్నూర్ నియోజకవర్గంలోని సింగరేణి ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్టులు (ఓసీపీలు), జైపూర్ ​సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో భూములు కోల్పోయిన నిర్వాసితుల నోళ్లలో మట్టికొట్టారు బాల్క సుమన్​, ఆయన అనుచరులు. భూములు కోల్పోయిన  ​కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని, కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ జాబ్స్​80  శాతం స్థానికులకే ఇస్తామని హామీ ఇచ్చి భూములను తీసుకున్నారు. 

కానీ చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​, ఆయన అనుచరులు ఒక్కొక్కరి దగ్గర రూ.లక్ష నుంచి రూ.2లక్షలు తీసుకొని తమకు కావాల్సిన వాళ్లకు, బీఆర్​ఎస్​ కార్యకర్తలకు, నాన్​ లోకల్స్​కు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఉపాధి లేక ఉద్యోగాల కోసం సింగరేణి అధికారుల చుట్టూ, బాల్క సుమన్​ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని భూనిర్వాసిత కుటుంబాల యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పంట పొలాలను ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్టులకు, పవర్​ ప్లాంట్ కు తీసుకొని తమ బతుకులను ఆగం చేశారని ఆవేదన చెందుతున్నారు. 

ఇచ్చింది నాలుగోవంతే.. అవీ  కాంట్రాక్టే..

నిర్వాసితుల్లో నాలుగో వంతు మందికే  కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ కొలువులు ఇచ్చారు. ఉదాహరణకు... ఎస్టీపీపీ ఏర్పాటు కోసం జైపూర్​ మండలంలోని పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి గ్రామాల పరిధిలో 1,883 ఎకరాల వ్యవసాయ భూములను సేకరించారు. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించడంతో జాబులు ఇస్తామని ఆశచూపారు. 825 భూనిర్వాసితుల కుటుంబాల్లో ఇంటికో పర్మినెంట్​ జాబ్​ ఇస్తామని సింగరేణి అధికారులు హామీ ఇచ్చారు. 80 శాతం కాంట్రాక్టు ఉద్యోగాలను స్థానిక నిరుద్యోగ యువతకే ఇస్తామని  చెప్పి, మొండిచేయి చూపారు. 

ఎస్టీపీపీలో సుమారు 1600 మంది కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో భూనిర్వాసితులు, స్థానికులు కేవలం 400 మందే ఉన్నారు. మిగతా 1200 మంది ఉత్తరాది రాష్ర్టాలకు చెందినవారే. పలు కీలకమైన విభాగాల్లో వారికే పెద్దపీట వేస్తున్నారు. ఉన్నతాధికారులు ఆ ప్రాంతం వారే కావడంతో లోకల్​ కార్మికులను చిన్నచూపు చూస్తున్నారు. 

కనీస వేతనాల చెల్లింపు, పని స్థలాల్లో భద్రత, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. స్థానిక యువతకు డిగ్రీ, పాలిటెక్నిక్​, బీటెక్​, ఎంటెక్​ క్వాలిఫికేషన్స్​ ఉన్నప్పటికీ అన్​స్కిల్డ్​ జాబ్స్​కే పరిమితం చేస్తున్నారు. ఉద్యోగ నియామకాలతో పాటు వేతనాల చెల్లింపుల్లోనూ వివక్ష చూపుతున్నారు. అన్​స్కిల్డ్​ కార్మికులకు రోజుకు రూ.475, సెమీ స్కిల్డ్​ కార్మికులకు రూ.520 చొప్పున చెల్లిస్తున్నారు. ఐదేండ్ల సర్వీస్, విద్యార్హతలను బట్టి స్కిల్డ్​ జాబ్స్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అన్యాయం చేస్తున్నారు.