
సామాన్య భక్తుల కోసం శ్రీవాణి పేరుతో కొత్త పథకం తీసుకొచ్చామని చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారిని కులశేఖరపడి కావలి వరకు VIPలు వెళ్లి దర్శించుకునే తీరులోనే సామాన్య భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అయితే ఈ దర్శనానికి 10వేల రూపాయలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం -శ్రీవాణి పేరుతో పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి. నవంబర్ మొదటివారంలో శ్రీవాణి ట్రస్ట్ పథకానికి సంబంధించిన మొబైల్ యాప్ ను తీసుకొస్తామన్నారు. దీనికి వచ్చే నిధులను వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి ఉపయోగిస్తామన్నారు.
శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళమిచ్చే దాతలకు ఒక బ్రేక్ దర్శన టికెట్ ప్రివిలేజ్గా ఒకసారి మాత్రమే అందిస్తామని, వెంటనే ఆ దాతలు రూ.500 చెల్లించి బ్రేక్ దర్శన టికెట్ కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు దాతలు ఒక రూపాయి నుంచి ఎంత మొత్తమైనా విరాళంగా అందించవచ్చని, రూ.10 వేల నుంచి TTD కల్పించే ప్రయోజనాలు వర్తిస్తాయని తెలిపారు.