Virat Kohli: ఆ భయంకరమైన ఓటమి నుంచి బయటకు రాలేకపోయాను: విరాట్ కోహ్లీ

Virat Kohli: ఆ భయంకరమైన ఓటమి నుంచి బయటకు రాలేకపోయాను: విరాట్ కోహ్లీ

సరిగ్గా ఆరేళ్ళ క్రితం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమి భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత బాధను మిగిల్చింది. 7 మ్యాచుల్లో విజయం సాధించి టేబుల్ టాపర్ గా వెళ్లిన మన టీంకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా రిజర్వ్ డే కు వెళ్లిన ఈ మ్యాచ్ లో ధోనీ, జడేజాల పోరాటంతో భారత్ గెలుస్తుందని ఆశించినా చివర్లో మాహీ రనౌట్ తో కివీస్ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ విరాట్ కోహ్లీని ఎంతగానో బాధించిందని తెలిపాడు.  

2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ సందర్భంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ గురించి వివరిస్తూ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. తన కెరీర్ లో ఈ ఓటమి భయంకరమైన హ్యాంగోవర్‌గా అభివర్ణించాడు. ఓటమిని అర్థం చేసుకోవడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని, తర్వాత ఏమి చేయాలో అర్థం కాలేదని విరాట్ చెప్పుకొచ్చాడు. 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఓటమి తర్వాత మేము చాలా ఒడిదుడుకులకు లోనయ్యాం. అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. వ్యక్తిగతంగా మీరు నన్ను అడిగితే.. చాలా ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్ ల ఫలితాలు నన్ను బాధించాయి.

2014 ఫైనల్, 2016 సెమీ-ఫైనల్.. నన్ను నిజంగా బాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2015 వరల్డ్ కప్ సెమీ-ఫైనల్ ఓటమితో చాలా నిరాశకు గురయ్యాం. ఇక 2019 సెమీ-ఫైనల్ నా కెరీర్ లో అత్యంత బాధించిన ఓటమి. సెమీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత  మేము మాంచెస్టర్ నుండి బయలుదేరబోతున్నాం. ఆ సమయంలో మాకు ఎం చేయాలో అసలు అర్ధం కాలేదు. ఆ సమయంలో భయంకరమైన హ్యాంగోవర్ లో ఉన్నాము. నేను ఏం చేస్తున్నానో నాకు అర్ధం కాలేదు". అని కోహ్లీ మయంతి లంగర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

ఈ మ్యాచ్ అనంతరం క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు టీమిండియా ఆటగాళ్లు బాగా బాధపడ్డారు. రోహిత్ శర్మ అయితే ఏడ్చేశాడు. ఇదిలా ఉండగా ఎప్పుడు భావోద్వేగాలను అదుపులో పెట్టుకునే ధోనీ సైతం ఔటైన తర్వాత బాగా ఎమోషనల్ అవ్వడం సగటు క్రికెట్ అభిమానిని కలిచి వేసింది. అయితే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ధోనీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌ చేరిన టీమిండియా.. ఈ మ్యాచు ఓటమితో మరోసారి ఐసీసీ టోర్నీ అందుకోకుండానే పోరాటం ముగించింది. ఈ  సెమీ ఫైనల్లో భారత్ పై న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. 

వర్షం అంతరాయం కలిగించిన ఈ సెమీ ఫైనల్లో మ్యాచ్ రెండు రోజులు జరిగింది. మొదట న్యూజిలాండ్ ను 239 పరుగులకే కట్టడి చేసిన భారత్.. బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ చేజార్చుకుంది. స్వింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ట్రెంట్‌ బౌల్ట్‌ నేతృత్వంలోనే కివీస్‌ పేస్‌ దళం చెలరేగిపోయింది. దీంతో జట్టు స్కోరు 5 పరుగులకే భారత్‌ కేఎల్ రాహుల్(1), రోహిత్ శర్మ(1), విరాట్ కోహ్లీ(1)ల వికెట్లను కోల్పోయింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ లో జడేజా 77 పరుగులతో వీరోచిత పోరాటం చేసినా కీలక సమయంలో జడేజాతో పాటు ధోనీ రనౌట్ కావడం భారత్ కు పరాజయం తప్పలేదు. 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది.