
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న కోహ్లీ.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. లక్నో వేదికగా మంగళవారం (మే 27) లక్నో సూపర్ జయింట్స్ పై హాఫ్ సెంచరీ చేసి దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును కోహ్లీ నెలకొల్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ 9000 పరుగులు చేశాడు.
ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడి 8594 పరుగులు చేసిన కోహ్లీ.. ఛాంపియన్స్ లీగ్ లో ఆర్సీబీ జట్టు తరపున ఆడి 400 పైగా పరుగులు సాధించాడు. దీంతో ఒకే జట్టుకు ఆడుతూ 9000 పరుగుల క్లబ్ లో చేరిన తొలి ప్లేయర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ తర్వాత ఈ లిస్ట్ లో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ ముంబై ఇండియన్స్ తరపున 6060 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ప్రస్తుతం 53 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఒకే జట్టు తరపున అత్యధిక పరుగుల వీరులు
9004* - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ
6060 - ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ
5934 - హాంప్షైర్ తరపున జేమ్స్ విన్స్
5528 - చెన్నై సూపర్ కింగ్స్ తరపున సురేష్ రైనా
5314 - చెన్నై సూపర్ కింగ్స్ తరపున MS ధోని