
పరుగుల రన్ మిషన్ గా పిలుచుకునే భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నారని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కోహ్లీ సహచర ఆటగాడు రోహిత్ టెస్టులకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. కోహ్లీ కూడా రోహిత్ బాటలోనే టెస్టుల నుంచి తప్పుకుంటాడని సమాచారం.
ఈ విషయం గురించి కోహ్లీ కూడా బీసీసీఐకి చెప్పినట్లు టాక్. అయితే తన నిర్ణయంపై కోహ్లీ మరోసారి ఆలోచించుకోవాలని సూచించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. జూన్ లో ఇంగ్లాండ్లో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని తెలుస్తోంది.
కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన కొద్ది రోజులకే కోహ్లీ రిటైర్మెంట్ వార్తలు చర్చనీయాంశంగా మారాయి. 2024 లో బార్బడోస్లో వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ, రోహిత్ ఇద్దరూ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కోహ్లీ కూడా రిటైర్ అయితే.. భారత టెస్ట్ జట్టుకు బ్యాటింగ్ విభాగంలో అంత సీనియర్లు లేకపోవడం భారత్ కు పెద్ద సవాల్. అప్పుడు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్ వంటి ఆటగాళ్లపై టీమిండియా ఆధారపడి ఉండాల్సి వస్తుంది.
2024-25 టెస్ట్ సీజన్లో విరాట్ కోహ్లీ తక్కువ పరుగులే చేశాడు. ఐదు మ్యాచ్ల బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాలో ఈ స్టార్ బ్యాటర్ ఫామ్ కోసం తంటాలు పడ్డాడు. ఐదు టెస్ట్లలో కోహ్లీ కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. పెర్త్లో జరిగిన సిరీస్ ఫస్ట్ టెస్ట్లో సెంచరీ చేసినప్పటికీ, మిగిలిన నాలుగు మ్యాచ్లలో అతను 85 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తం 123 టెస్టులు ఆడిన కోహ్లీ 30 సెంచరీలతో సహా 9,230 పరుగులు చేశాడు.
అయితే ప్రస్తుతం ఆగిపోయిన ఐపీఎల్ లో కోహ్లీ అదరగొడుతున్నాడు. కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు .RCB తరపున 11 మ్యాచ్ల్లో 505 పరుగులు చేశాడు. కోహ్లీ రిటైర్మెంట్ వార్తలు ఎంత వరకు నిజమనేది తెలియాలంటే ఇంగ్లండ్ టూర్ కు జట్టు ఎంపిక కోసం బీసీసీఐ త్వరలోనే సమావేశం అవుతుంది. అప్పటి వరకు వేచిచూడాల్సిందే..