
వెల్లింగ్టన్ : టెస్ట్ల్లో ముఖ్యంగా విదేశాల్లో ఆడే మ్యాచ్ల్లో బ్యాట్స్ మెన్ అతి జాగ్రత్తకు పోవడం వల్ల ఆశించిన ఫలితం దక్కదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్ అప్రోచ్ మార్చుకోవాలని తమ బ్యాట్స్ మెన్ కు సూచించాడు. బేసిన్ రిజర్వ్లో న్యూజిలాండ్ తో జరిగిన ఫస్ట్ టెస్ట్ లో ఇండియా పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండుఇన్నింగ్స్ల్లోనూ 200 మార్కు దాటలేకపోయింది. సిరీస్లో రెండో, చివరి టెస్ట్ శనివారం క్రైస్ట్ చర్చ్లో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్లో పలువురి బ్యాటింగ్ విధానంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘మా బ్యాటింగ్ యూనిట్ అప్రోచ్ సరిచేయాల్సి ఉంది. బ్యాట్స్మెన్ అతి జాగ్రత్తకు పోవడం వల్ల లాభం ఉండదు. ఎందుకంటే క్రీజులో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో కొన్ని షాట్లు ఆడడం మా నేస్తాం . సింగిల్స్ తీయడం కూడా కష్టమనుకునే సందర్భంలో ఎవరైనా మంచి బాల్కోసం వేచి చూస్తారు. కానీ ఈక్రమంలో ఔటై పోతుంటారు. ఓ మంచి డెలివరీకి ఔటై పోయానని సర్దిచెప్పుకోవచ్చు. కానీ నేను దానిని అంగీకరించను. పరిస్థితి ప్రకారం ఆడతాను. వికెట్ గ్రీన్గా ఉంటే ప్రత్యర్థిపై కౌంటర్ అటాక్ చేసి జట్టును ముందుకు తీసుకెళ్తా. ఒకే వేళ ఫెయిలైనా.. మన ప్రయత్నం సరైనదే కాబట్టి బాధ అనిపించదు. నాకు తెలిసినంతలో విదేశీ గడ్డపై అతి జాగ్రత్త వల్ల ఉపయోగం ఉండదు. ఫారిన్ టూర్లకు వచ్చినప్పుడు పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచిస్తే బ్యాటింగ్ బాగా చేయలేం . వేరేదేశాల్లో ఆడుతున్నప్పుడు మానసికంగా సిద్ధం కావడంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు టెక్నిక్ అంటూ చాలా చర్చిస్తాం . కానీ మైండ్ క్లియర్ గా ఉంటే ఎలాంటి పరిస్థితిల్లో నైనా రాణించగలం. బాల్ ఎక్కువ టర్న్ అవుతుంది, బౌలింగ్ అటాక్ బలంగా ఉంది లాంటి మాటలు ప్రభావం చూపవు. ఫస్ట్ టెస్ట్ లో ఇలాంటి విధానాన్ని మేము పాటించలేదు. కానీ పాటించిన రోజున అనుకున్నది సాధిస్తాం ’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.