సెకెండ్‌వేవ్‌ ఉన్నా..విశాక లాభం పైకి!

సెకెండ్‌వేవ్‌ ఉన్నా..విశాక లాభం పైకి!

జూన్ క్వార్టర్‌‌లో 18 % పెరిగిన కంపెనీ నెట్‌ ప్రాఫిట్‌
రూ. 351.17 కోట్లకు రెవెన్యూ..

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: కరోనా సెకెండ్‌‌ వేవ్‌‌ వలన ఇబ్బందులు ఎదురయినప్పటికీ, ఏప్రిల్‌‌–జూన్‌‌ క్వార్టర్‌‌ (క్యూ1) ‌‌లో విశాక ఇండస్ట్రీస్ మంచి పనితీరుని కనబరిచింది. కంపెనీకి  కిందటేడాది జూన్‌‌ క్వార్టర్‌‌‌‌లో రూ. 286.74 కోట్ల రెవెన్యూ రాగా, ఈ ఏడాది జూన్‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో  రూ. 351.17 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇది 22 శాతం పెరుగుదల.  కంపెనీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్‌‌ (పీబీటీ) ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరిగి  రూ. 54.64 కోట్లకు చేరుకుంది.   విశాక ఇండస్ట్రీస్ నికర లాభం (ట్యాక్స్‌‌లు చెల్లించాక మిగిలిన లాభం)  18 శాతం పెరిగి రూ. 40.58 కోట్లుగా రికార్డయ్యింది. జూన్‌‌, 2020 క్వార్టర్‌‌‌‌లో కంపెనీ నెట్ ప్రాఫిట్‌‌  రూ. 34.42 కోట్లు.
బిల్డింగ్ ప్రొడక్ట్‌‌లకు గిరాకీ..
బిల్డింగ్ ప్రొడక్ట్స్‌‌  బిజినెస్‌‌ (సిమెంట్ రూఫ్‌‌లు, వీ నెక్స్ట్‌‌)  నుంచి విశాక ఇండస్ట్రీస్‌‌కు జూన్ క్వార్టర్‌‌‌‌లో  రూ. 319.38 కోట్ల రెవెన్యూ వచ్చింది.  కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో ఈ సెగ్మెంట్‌‌ నుంచి వచ్చిన రెవెన్యూ రూ.  271.89 కోట్లతో పోలిస్తే  ఇది 17 శాతం ఎక్కువ. ఈ సెగ్మెంట్‌‌ నుంచి  కంపెనీకి రూ. 62.01 కోట్ల నికర లాభం వచ్చింది. వండర్‌‌‌‌ యార్న్‌‌ బిజినెస్‌‌ కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే మెరుగుపడిందని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. కానీ, ఇంకా కరోనా ముందు స్థాయికి చేరుకోలేదని తెలిపింది. ఈ ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌‌‌లో వండర్ యార్న్‌‌ బిజినెస్‌‌ నుంచి విశాకకు రూ. 29.69 కోట్ల  రెవెన్యూ రాగా, రూ. 3.30 కోట్ల నికర లాభం వచ్చింది. సెకెండ్‌‌వేవ్‌‌ దెబ్బకు దేశ ఎకానమీ దెబ్బతిందని, కన్జూమర్లు తమ ఖర్చులను తగ్గించేశారని కంపెనీ జాయింట్ ఎండీ జీ వంశీ కృష్ణ పేర్కొన్నారు. అయినప్పటికీ, మార్కెట్‌‌లో విశాక ఇండస్ట్రీస్‌‌ పొజిషన్‌‌, బిల్డింగ్‌‌ ప్రొడక్ట్స్‌  సెగ్మెంట్ డిమాండ్ చెక్కు చెదరలేదని అన్నారు.  రాయ్‌‌బరేలిలో ఒకసిమెంట్ రూఫ్‌‌ల తయారీ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.