- విశాక రెవెన్యూ క్యూ3లో రూ. 354 కోట్లు
- 2020 లోని క్యూ3 తోపోలిస్తే 26 శాతం అప్
హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్కు డిసెంబర్తో ముగిసిన క్వార్టర్లో (క్యూ3) రూ. 353.83 కోట్ల రెవెన్యూ వచ్చింది. 2020 లోని క్యూ3తో పోలిస్తే ఈ సారి కంపెనీ రెవెన్యూ 26 శాతం పెరిగింది. కంపెనీకి క్యూ3 లో రూ. 32.92 కోట్ల ప్రాఫిట్ (పన్నులకు ముందు లాభం) రాగా, అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లో రూ. 31.13 కోట్ల ప్రాఫిట్ను కంపెనీ ప్రకటించింది. బిల్డింగ్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్లో సేల్స్ పెరిగాయని విశాక ఇండస్ట్రీస్ పేర్కొంది. ఏడాది ప్రాతిపదికన చూస్తే క్యూ3లో కంపెనీ బిల్డింగ్ ప్రొడక్ట్ల సేల్స్ 12.3 శాతం పెరగగా, క్వార్టర్ ప్రాతిపదికన 18.8 శాతం పెరిగాయి. ప్లాస్టిక్ నుంచి దారాలు తయారు చేసే వండర్ యార్న్ బిజినెస్ క్యూ3 లో కరోనా ముందు స్థాయిలను దాటేసిందని విశాక ఇండస్ట్రీస్ ప్రకటించింది. కంపెనీ యార్న్ సెగ్మెంట్లో సేల్స్ ఏడాది ప్రాతిపదికన 47.6 శాతం, క్వార్టర్లీ పరంగా 58 శాతం పెరిగాయని పేర్కొంది.
ఏప్రిల్–డిసెంబర్ మధ్య అదుర్స్..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో కంపెనీకి రూ. 995.15 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆర్థిక సంవత్సరం 2020–21 లోని మొదటి తొమ్మిది నెలలతో పోలిస్తే ఈ సారి కంపెనీ రెవెన్యూ 25.60 శాతం పెరగడం విశేషం. కిందటేడాది ఏప్రిల్– డిసెంబర్ మధ్య విశాక ఇండస్ట్రీస్కు రూ. 88.41 కోట్ల నికర లాభం వచ్చింది. ఏడాది ప్రాతిపదికన ఇది 10.8 శాతం ఎక్కువ.
ఇనొవేటివ్ ప్రొడక్ట్లు ఫలితానిస్తున్నాయి..
కంపెనీ తీసుకొచ్చిన ఇనొవేటివ్ ప్రొడక్ట్లు ప్రస్తుతం మంచి ఫలితాలనిస్తున్నాయని విశాక ఇండస్ట్రీస్ జాయింట్ ఎండీ జీ వంశీకృష్ణ అన్నారు. ఫైబర్ సిమెంట్ బోర్డు సెగ్మెంట్లో ముమెంటం ఉందని, ఆటమ్ సోలార్ రూఫ్లను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. యార్న్ సెగ్మెంట్ కరోనా ముందు స్థాయిల కంటే మంచి పనితీరు కనబరిచిందని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడంతో కంపెనీ మార్జిన్లపై కొంత ప్రభావం పడిందని, ఎకానమీ ఓపెన్ అవుతుండడంతో రానున్న క్వార్టర్లలో మార్జిన్లు మెరుగుపడతాయని అంచనావేశారు. కాగా, రాయ్బరేలి (ఉత్తరప్రదేశ్) లో ఓ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ను విశాక ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ కెపాసిటీ ఏడాదికి లక్ష టన్నులు. ఈ ప్లాంట్ కూడా అందుబాటులోకి వస్తే విశాక మొత్తం కెపాసిటీ ఏడాదికి 9,02,000 టన్నులకు చేరుకుంటుంది. 2020–21 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించి మొదటి బిజినెస్ సస్టయినబిలిటీ రిపోర్ట్ను విశాక ఇండస్ట్రీస్ పబ్లిష్ చేసిన విషయం తెలిసిందే.