రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాఖ

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాఖ

40 ఏళ్లలో భారీగా విస్తరించిన కంపెనీ

పర్యావరణ అనుకూల ప్రొడక్ట్‌‌లతో ముందుకు

ఇంటర్నేషనల్ క్లయింట్లతో గ్లోబల్‌‌గా విస్తరణ

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: కొత్త ఆలోచనలతో ముందుకొచ్చిన కంపెనీలలో కొన్ని మాత్రమే చివరి వరకు నిలబడతాయి. ఇలాంటి వాటిలో విశాక ఇండస్ట్రీస్‌‌ ముందుంటుందని చెప్పొచ్చు. నలబై ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ కంపెనీ, ఎవరూ చూడని రంగాల వైపు తన  ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. సిమెంట్‌‌ రూఫ్‌‌లతో ప్రారంభమైన కంపెనీ,   ప్లాస్టిక్ బాటిల్స్‌‌ నుంచి దారాల(ఫైబర్‌‌‌‌)ను, ప్లైవుడ్‌‌కు ప్రత్యామ్నాయంగా వీనెక్స్ట్‌‌ బోర్డ్‌‌లను, తాజాగా ఆటమ్‌‌ పేరుతో సోలార్ రూఫ్‌‌లను తయారు చేస్తోంది.  పర్యావరణానికి హాని కలిగించని ప్రొడక్ట్‌‌లతో మార్కెట్లో విస్తరిస్తోంది. వీ నెక్ట్స్‌‌ బోర్డ్‌‌లను తీసుకొచ్చాక ఇప్పటి వరకు ఐదు లక్షల చెట్లు ప్లైవుడ్‌‌గా మారకుండా కాపాడగలిగామని, 90 వేల టన్నుల సీఓ2 వెలువడకుండా ఆపగలిగామని, 10 కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్‌‌ను రీసైకిల్‌‌ చేయగలిగామని పేర్కొంది.

రూ. ఐదు లక్షలతో ప్రారంభం..

విశాక ఇండస్ట్రీస్‌‌ను రూ. ఐదు లక్షలతో గడ్డమ్‌‌ వెంకటస్వామి 1980 లో ప్రారంభించారు. ఆయన కుమారుడు జీ వివేక్ వెంకటస్వామి కంపెనీని ముందుకు తీసుకెళ్లారు. 2008 లో కంపెనీ బాధ్యతలు తీసుకున్న జీ.  వంశీ విశాక ఇండస్ట్రీస్‌‌ను మరింత విస్తరించారని చెప్పొచ్చు. 2019–20 లో విశాక ఇండస్ట్రీస్‌‌ టర్నోవర్‌‌‌‌  రూ. 1,127 కోట్లకు పెరిగింది. ‘కంపెనీని మా తాతాయ్య, నాన్న  కొత్త శిఖరాలకు చేర్చారు. 2008 లో కంపెనీలో చేరిన నేను ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నాను. అది ఇండియన్‌‌ ప్రొడక్ట్‌‌లను గ్లోబల్‌‌గా విస్తరించడం’ అని వంశీ చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఓ బిజినెస్‌‌ను ఏర్పాటు చేయాలని 1980లో వెంకట స్వామి అనుకున్నారు. కానీ 1991 లో వచ్చిన ఆర్థిక సంస్కరణలతో బిజినెస్ లైసెన్స్‌‌ పొందడం కష్టంగా మారింది. ఆ టైమ్‌‌లో కన్‌‌స్ట్రక్షన్‌‌ సెక్టార్‌‌‌‌ వేగంగా విస్తరిస్తుండడంతో ఈ ఇండస్ట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయాలని స్వామి నిర్ణయించుకున్నారు. అప్పటికి ఉస్మానియా యూనివర్శిటీలో ఎంబీబీఎస్‌‌ చదువుతున్న వివేక్‌‌తో కలిసి విశాక ఇండస్ట్రీస్‌‌ను ప్రారంభించారు. తన దగ్గరున్న  రూ. 5 లక్షలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌‌ ఇండస్ట్రీయల్‌‌ బోర్డ్‌‌ నుంచి అప్పు తీసుకొని ఈ కంపెనీని వెంకట స్వామి స్టార్ట్‌‌ చేశారు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్‌‌ అయిన విశాక,  ప్రస్తుతం ఇండియా మొత్తం మీద బిజినెస్‌‌ చేస్తోంది. అతి పెద్ద గ్లోబల్‌‌ కంపెనీల నుంచి ఆర్డర్లను అందుకుంటోంది.

సోలార్‌‌‌‌ ప్యానెల్స్‌‌తో రూఫ్‌‌ టాప్‌‌లు..

వీనెక్స్ట్‌‌ తర్వాత రెన్యూవబుల్‌‌ ఎనర్జీ ప్రొడక్ట్‌‌ల వైపు కంపెనీ అడుగేసింది. అప్పటి వరకు సోలార్ ప్యానెల్స్‌‌తో కలిసి రూఫ్‌‌ టాప్‌‌లను ఎవరూ తీసుకురాలేదు. ఈ ఆలోచనతో కంపెనీ ముందుకొచ్చింది. ఆటమ్ పేరుతో సోలార్  రూఫ్‌‌ల బిజినెస్‌‌ను 2018 లో కంపెనీ స్టార్ట్‌‌ చేసింది. రెండేళ్ల పాటు రీసెర్చ్ చేసి సోలార్‌‌‌‌ ఎనర్జీతో బిల్డింగ్‌‌ మెటీరియల్స్‌‌ను తీసుకొచ్చామని వంశీ చెప్పారు. సిమెంట్‌‌ బోర్డులు, పాలీ లేదా మోనో క్రిష్టలైన్‌‌ సోలార్‌‌‌‌ సెల్స్‌‌తో  సోలార్‌‌‌‌ రూఫ్‌‌లను కంపెనీ తయారు చేస్తోంది. ‘ఈ రూఫ్‌‌లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ప్రపంచంలోనే మొదటి సారిగా సోలార్‌‌‌‌ ప్యానెల్స్‌‌ను డైరక్ట్‌‌గా రూఫ్‌‌లలాగా వాడుకునే ప్రొడక్ట్‌‌లను తీసుకొచ్చాం’ అని వంశి పేర్కొన్నారు. అదే ఏడాది వీ–ఇన్‌‌ఫిల్‌‌ పేరుతో లోడ్‌‌ను భరించే  కన్‌‌స్ట్రక్షన్ ప్రొడక్ట్‌‌లను కంపెనీ తీసుకొచ్చింది. హైదరాబాద్‌‌లో అమెజాన్‌‌ ఆఫీస్‌‌ నిర్మాణంలో, బెంగళూరులోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌‌ నిర్మాణంలో కంపెనీ ప్రొడక్ట్‌‌లను వాడారు.

పర్యావరణానికే ఎక్కువ ప్రాధాన్యం..

సిమెంట్‌‌ రూఫ్‌‌లను లోకల్‌‌గా దొరికే ప్రొడక్ట్‌‌లతోనే కంపెనీ తయారు చేయడం ప్రారంభించింది. 1992 లో టెక్స్‌‌టైల్‌‌ బిజినెస్‌‌లోకి విశాక ఎంటర్‌‌‌‌ అయ్యింది. పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ నుంచి దారాలను తయారు చేయడం ప్రారంభించింది. వండర్ యాన్ పేరుతో మొదలైన ఈ బిజినెస్‌‌ పీఈటీ(పాలీఇథైలిన్‌‌ టెరప్తాలేట్‌‌) బాటిల్స్‌‌ నుంచి దారాలను తయారు చేస్తోంది.  ఇప్పటి వరకు 10 కోట్ల పీఈటీ బాటిల్స్‌‌ను కంపెనీ రీసైకిల్ చేసింది. వంశీ కంపెనీ బాధ్యతలు చేపట్టాక విశాక ఇండస్ట్రీస్‌‌ ఇతర వ్యాపారాల్లోకి ఎంటర్ అయ్యింది. ఆయన నాయకత్వంలో విశాక ఇండస్ట్రీస్‌‌  ప్లైవుడ్‌‌కు ప్రత్యామ్నాయంగా ఫైబర్ సిమెంట్‌‌ బోర్డ్‌‌లను   వీనెక్ట్స్‌‌ కింద తీసుకొచ్చింది. వీనెక్స్ట్‌‌ బోర్డ్‌‌, వీనెక్స్ట్‌‌ పీమియం, వీప్రీమియం ప్లాంక్ వంటి ప్రొడక్ట్‌‌లను ఈ కంపెనీ అమ్ముతోంది. ఇప్పటి వరకు 71 కోట్ల చదరపు అడుగుల్లో వీ నెక్స్ట్‌‌ బ్రాండ్‌‌ ప్రొడక్ట్‌‌లను ఇన్‌‌స్టాల్ చేశామని వంశీ పేర్కొన్నారు. ప్లైవుడ్‌‌ కోసం నరికేయకుండా ఐదు లక్షల చెట్లను కాపాడామని చెప్పారు.

లోకల్ నుంచి గ్లోబల్‌‌గా..

ప్రస్తుతం విశాక ఇండస్ట్రీస్‌‌కు 12 మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లున్నాయి. 13 మార్కెటింగ్‌‌ ఆఫీసులు, 7 వేలకు పైగా డీలర్ అవుట్‌‌లెట్లు ఉన్నాయి.  గ్లోబల్‌‌గా పేరున్న కంపెనీలు విశాకకు క్లయింట్లుగా ఉన్నాయి. వండర్‌‌‌‌ యార్న్‌‌ ప్రొడక్ట్‌‌లను బ్రిటిష్‌‌ మల్టినేషనల్‌‌ రిటైలర్‌‌‌‌ మార్క్స్‌‌ అండ్‌‌ స్పెన్సర్‌‌‌‌, ఇండియన్ బ్రాండ్లు రేమాండ్, సియారమ్‌‌ వంటి కంపెనీలకు అమ్ముతున్నామని వంశీ పేర్కోన్నారు. వీశాక టెక్స్‌‌టైల్ ప్రొడక్ట్‌‌లలో 30 శాతం యూరప్‌‌, సౌత్‌‌ అమెరికాకు ఎగుమతి చేస్తున్నామని అన్నారు. వీనెక్స్ట్‌‌బిల్డింగ్ ప్రొడక్ట్‌‌లు పశ్చిమాసియా, ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు.  ప్రస్తుతం విశాక ఇండస్ట్రీస్‌‌లో 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఆటమ్‌‌ సోలార్‌‌‌‌ కార్ట్‌‌లు ఫ్రీగా..

కరోనా సంక్షోభంతో రోడ్డున పడ్డ వీది వ్యాపారులకు సాయం చేసేందుకు విశాక్ ఇండస్ట్రీస్‌‌, ది బెటర్ ఇండియా ముందుకొచ్చాయి. ప్రతి ఒక్కరు అవసరాలలో ఉన్న ఐదు మంది స్ట్రీట్‌‌ వెండర్లకు విశాక సోలార్ ఈ–కార్ట్‌‌లను డొనేట్‌‌ చేయాలని పిలుపునిచ్చాయి. గత నెలలో ఐదు మంది వెండర్లకు ఈ–కార్ట్‌‌లను విశాక డొనేట్‌‌ చేసింది.  #గిఫ్ట్‌‌ఏకార్ట్‌‌ అనే క్యాంపెయిన్‌‌ను విశాక ఇండస్ట్రీస్‌‌, ది బెటర్‌‌‌‌ ఇండియాలు  నడుపుతున్నాయి. కరెంట్ కోసం ఆటమ్‌‌ ఈ–కార్ట్‌‌లపైన సోలార్‌‌‌‌ రూఫ్ ఉంటుంది. ఈ–కార్ట్‌‌లకు మెయింటెనెన్స్ పెద్దగా అవసరం ఉండదు. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకుంటుంది. ఒక్కొక్క కార్ట్ ధర రూ. 40 వేలు. ది బెటర్‌‌‌‌ ఇండియా రూ. 2 లక్షలను సేకరించి అవసరాలలో ఉన్న ఐదు మంది స్ట్రీట్‌‌ వెండర్లకు సోలార్‌‌‌‌ ఈ–కార్ట్‌‌లను డొనేట్‌‌ చేసింది.

For More News..

దాదాకు బదులుగా జై షా

నాలుగేళ్లయినా ఎట్టి బతుకులే! నాలుగున్నర ఏళ్లలో రూ.100 పెంచిన్రు

రూ. 40కి కూరగాయలు కొని.. రూ. 500 ఇవ్వడంతో దొరికిన దొంగనోట్లు