మళ్లీ నా నియోజకవర్గానికి వచ్చా: గాజువాక సభలో పవన్ కళ్యాణ్

మళ్లీ నా నియోజకవర్గానికి వచ్చా:  గాజువాక సభలో పవన్ కళ్యాణ్

గాజువాకలో ఓడిపోయిన తనకు ప్రజలు ఇంత ఘన స్వాగతం పలకడంతో ఇక్కడ నిజంగా ఓటమి తెలియట్లేదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తనను ఓడించిన గాజువాక ప్రజల ముందుకు వెళితే ఆదరిస్తారా అని సందేహపడ్డానని, అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఘన స్వాగతం పలికారని గుర్తుచేసుకున్నారు. 2019 ఎన్నికల్లో త్రికరణ శుద్ధిగా పనిచేశాను, ఈరోజు అదే ఉద్దేశంలో నా నియోజకవర్గానికి వచ్చాను అన్నారు. గాజువాకలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఓ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఓటమిని ఎలా తీసుకోవాలో తెయదన్నారు. ఇటీవల జగదాంబ సెంటర్ లో తాను ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. అంబేద్కర్, గాంధీ ఆశయాలు.. నేతాజీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు వినిపిస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీకి చాలా కీలకమైనది. తెలంగాణకు చెందిన వారితో కలిపి మొత్తం 30కి పైగా బలిదానాలు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఎందరో అమరులై స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు అనే వ్యత్యాసం లేకుండా అంతా విశాఖ ఉక్కు ఎప్పటికీ ఆంధ్రుల హక్కు అని ప్రజలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గానీ, అమరావతిలోగానీ పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వారికి న్యాయం జరగాలన్నారు. పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులు దేవాలయాల వద్ద బిక్షాటన చేసి బతికారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం జగన్ మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడరని, అలాంటప్పుడు నీకు రాజకీయాలు అవసరమా అని సెటైర్లు వేశారు.