
తాడిచర్ల మైన్స్ అనేది దాదాపు రూ.20వేల కోట్ల భారీ కుంభకోణమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తాడిచర్ల మైన్స్ ను ఏఎంఆర్ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించిన పాపం కేసీఆర్దేనని పేర్కొన్నారు. తాడిచర్ల మైన్స్ ను ప్రైవేటు కంపెనీ ఏఎంఆర్ కు అప్పగిస్తూ జరిగిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.
“కోల్ ఇండియా ప్రకారం ఒక టన్ను బొగ్గు సగటు ధర రూ.560 మాత్రమే. అయితే ఇక్కడ సింగరేణి నుంచి జెన్ కో కు ఒక్కో టన్ను బొగ్గును దాదాపు రూ.3500కు ఏఎంఆర్ కంపెనీ అమ్ముతూ భారీ లాభాలు గడిస్తోంది. పరిమితికి మించిన రేట్లతో జెన్ కోకు బొగ్గు విక్రయం సరికాదు”అని ఆయన తెలిపారు.
లాభం అనేది సింగరేణికి అందాలే కానీ.. ఏఎంఆర్ కంపెనీకి ఎలా ఇస్తరని వివేక్ ప్రశ్నించారు. అది ఎవరి కంపెనీ ?అందులో కల్వకుంట్ల కుటుంబం వాటా ఉందా ? లేదా ? అనే దానిపై విచారణ జరగాలన్నారు. ‘‘ సింగరేణి సంస్థ నుంచి ఏఎంఆర్ కంపెనీ వాళ్లు తప్పుడు రిపోర్టులు రాయించుకుంటున్నరు. బొగ్గు హై గ్రేడ్ ది అని చెప్పి ఏఎంఆర్ కంపెనీకి ఎక్కువ రేటును ప్రభుత్వం చెల్లిస్తోంది” అని వివరించారు. తాడిచర్ల మైన్స్ ప్రైవేటీకరణ వ్యవహారం, బొగ్గు విక్రయాల్లో అక్రమాలపై విచారణ జరగాల్సిన అసవరముందని ఆయన డిమాండ్ చేశారు.