పోతిరెడ్డిపాడుపై జగన్ కు ఐడియా ఇచ్చిందే కేసీఆరే

పోతిరెడ్డిపాడుపై జగన్ కు ఐడియా ఇచ్చిందే కేసీఆరే

హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుకోవటానికి ఏపీ సీఎం జగన్ కు ఐడియా ఇచ్చింది సీఎం కేసీఆరేనని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జి. వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అన్ని వైపుల నుంచీ విమర్శలు రావడంతోనే ఇప్పుడు పోతిరెడ్డిపాడును అడ్డుకుంటామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. ఈ మేరకు వివేక్  మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుకోవటానికి ఏపీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినపుడు కేసీఆర్ నోరు మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. దీనిపై అన్ని పార్టీల నేతలు ప్రశ్నించడంతోనే కేసీఆర్  నోరు విప్పారు. సుప్రీంకోర్టుకు వెళతానని అంటున్నారు. జగన్ కు, కేసీఆర్ కు కామన్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి. ఇరు రాష్ట్రాలను ఎలా దోచుకోవాలనేది వాళ్ల కుట్ర. ఈ కుట్రను కేంద్రం దృష్టికి తీసుకెళ్తం.

ఈ విషయంలో జోక్యం చేసుకుని పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు ప్రక్రియను ఆపాల్సిందిగా కోరుతాం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి దగ్గర కేసీఆర్  కమీషన్లు తీసుకున్నారు. అలా కమీషన్లు ఎలా తీసుకోవాలని జగన్ ను ప్రగతిభవన్ కు పిలిపించి మరీ ఐడియా ఇచ్చింది కేసీఆరే. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతామంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ.. వ్యతిరేకిస్తున్నట్టు నాటకమాడుతున్నారు. కేసీఆర్, జగన్  ఇద్దరు అన్నదమ్ములని ఏపీ ఇరిగేషన్ మంత్రి కరెక్టుగానే చెప్పారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు గంగలో కలిసినా ఏమీ కాదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నరు. ఏపీ సర్కారు తీరుకు వ్యతిరేకంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటేనే ఏదైనా అర్థముంటుంది’’అని వివేక్ పేర్కొన్నారు.

ఖైరతాబాద్ గణేశుడు ఒక్క అడుగు ఎత్తే