వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలోకి చేరిన BRS, కాంగ్రెస్ కార్యకర్తలు

వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలోకి చేరిన BRS, కాంగ్రెస్ కార్యకర్తలు

తెలంగాణ బీజేపీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పాలనకు ఆకర్షితులై కమలం కండువా కప్పుకునేందుకు పలు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ రాక్షస పాలన భరించలేక మోడీ సుపరిపాలన చూసి ప్రజలందరూ కమలం పార్టీలోకి  చేరుతున్నారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని వదిలిపెట్టి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అక్రమంగా దోచుకుంటుందని ఆరోపించారు. ఫామ్ హౌస్ కేసును  సిబిఐ దర్యాప్తునకు అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. 

ఫామ్ హౌస్కేసులో తమపార్టీకి సంబంధం లేదని మొదటి నుంచి చెప్తున్నామని..బీజేపీని కేసీఆర్ బదనాం చేసే కుట్రలు చేశారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుతోఫామ్ హౌస్ కేసులో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసుకొని ఫామ్ హౌస్ కేసులో  బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు సంబంధం ఉందని ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. 

పెద్దపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి BRS, కాంగ్రెస్  పార్టీలకు చెందిన 126 మంది కార్యకర్తలు వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ  కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గం నేత గొట్టే ముక్కుల సురేష్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.