కేసీఆర్​ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తం : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్​ దోచుకున్న  లక్ష కోట్లు కక్కిస్తం : వివేక్ వెంకటస్వామి

 

  •     కాళేశ్వరం నీళ్లు రైతులకు రాలేదు గానీ.. కేసీఆర్ ఫామ్ హౌస్​కు పోతున్నయ్
  •     ధరణితో హైదరాబాద్ చుట్టుపక్కల 20 వేల ఎకరాలు సెటిల్ మెంట్ చేసుకున్నరు
  •     ఇసుక దందాలో బాల్క సుమన్ రూ.2 వేల కోట్లు దోచుకున్నడు 
  •     చెన్నూరు నుంచి సుమన్​ను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు 
  •     చెన్నూరులో బైక్​ ర్యాలీ, రోడ్​ షో.. మద్దతు తెలిపిన కోదండరాం

కోల్​బెల్ట్/జైపూర్/చెన్నూరు, వెలుగు: కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తున్నదని మాజీ ఎంపీ, కాంగ్రెస్​నేత వివేక్​వెంకటస్వామి మండిపడ్డారు. ‘‘ పేదలకు డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు రాలేదు గానీ కేసీఆర్ కుటుంబసభ్యులకు ఫామ్​హౌస్​లు వచ్చినయ్. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యని కేసీఆర్.. తన​కుటుంబానికి పది ఉద్యోగాలు ఇచ్చుకున్నడు” అని ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ బైక్​ర్యాలీకి వివేక్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందారం, భీమారం, జైపూర్, చెన్నూరులో నిర్వహించిన రోడ్​షోలలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, టీజేఎస్​అధ్యక్షుడు ప్రొఫెసర్​కోదండరాం, హైకోర్టు అడ్వకేట్​శరత్, వంశీకృష్ణ, పాపిరెడ్డి, సీనియర్​జర్నలిస్ట్​విఠల్​తో కలిసి వివేక్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్ అంటే కల్వకుంట్ల కమీషన్​రావు. కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ప్రజలకు రాలేదు గానీ కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోతున్నయ్. ధరణి ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల 20 వేల ఎకరాలు కేసీఆర్ ఫ్యామిలీ సెటిల్ మెంట్ చేసుకున్నది. కాళేశ్వరం పేరుతో కేసీఆర్​దోచుకున్న లక్ష కోట్లను కాంగ్రెస్​అధికారంలోకి రాగానే కక్కిస్తం. దీనిపై రాహుల్​కూడా మాటిచ్చారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోవుడు ఖాయం’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్​పార్టీలో ఎంపీలుగా తెలంగాణ కోసం మేం ఉద్యమించాం. తెలంగాణ ఎందుకు కావాలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వివరించాం. పార్లమెంట్​వేదికగా గట్టి పోరాటం చేసినం. పదవిలో ఉన్నా లేకున్నా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కష్టనష్టాల్లో అండగా నిలిచాను. విశాక ట్రస్ట్​, వెంకటస్వామి ఫౌండేషన్​ద్వారా చెన్నూరు నియోజకవర్గంలో మంచి నీటి సమస్య తీర్చేందుకు వేలాది బోర్లు వేయించాం’’ అని చెప్పారు. 

బాల్క సుమన్.. ప్రజలపై వెయ్యి కేసులు పెట్టించిండు 

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్...​ కేసీఆర్ బానిస అని వివేక్​విమర్శించారు. ‘‘కేసీఆర్ అండతో సుమన్ నియోజకవర్గం నుంచి  రూ.5 వేల కోట్ల ఇసుకను అక్రమంగా తరలించారు. అందులో కమీషన్ల ద్వారా​రూ.2 వేల కోట్లు దోచుకున్నారు” అని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఇసుక ఆన్​లైన్​ విధానం రద్దు చేస్తామని చెప్పారు. ‘‘బాల్క సుమన్ ఒక అహంకారి. ఆయన సొంత పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోరు. రాత్రి12 గంటలకు నిద్రలేచి, 2 గంటలకు వెళ్లిపోతారు. కనీసం ప్రజల సమస్యలను వినే ఓపిక కూడా ఆయనకు లేదు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునిగి పోతుంటే బాల్క సుమన్ ఎందుకు పరిహారం ఇప్పించడం లేదు. చెన్నూరుకు ఫండ్స్​ఎందుకు తేవడం లేదు” అని ప్రశ్నించారు. 

‘‘తనపై 100 కేసులు ఉన్నాయని సుమన్​అంటున్నడు. కానీ నియోజకవర్గ ప్రజలపై ఆయన వెయ్యికి పైగా కేసులు పెట్టించిండు. వాళ్లు, వాళ్ల ఫ్యామిలీలంతా బాల్క సుమన్​ను ఓడించేందుకు సిద్దంగా ఉన్నరు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే  బాల్క సుమన్​, ఆయన అనుచరులు చేసిన భూదందాలపై విచారణ చేయిస్తాం. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన బాల్కసుమన్​ను చెన్నూరు నుంచి తరిమికొట్టాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చినంక కాక వెంకటస్వామి జైపూర్ కు తెచ్చిన పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిన భూములకు రైతులకు న్యాయం చేస్తామన్నారు. 

వివేక్ సభలో కౌలు రైతు ఆవేదన.. 

‘‘నేను గ్రూప్​వన్​రాస్తే ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తే కొనుగోళ్ల టైమ్ లో ప్రభుత్వం ఇబ్బందులు పెడ్తున్నది’’ అని నిరుద్యోగి, కౌలురైతు కూడా అయిన భూక్యారాజ్ కుమార్​ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ సభ వేదికపైకి స్వచ్ఛందంగా వెళ్లిన రాజ్​కుమార్.. కౌలు రైతుల బాధలను వివరిం చారు. కౌలు రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఆరు గాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు వెళ్తే రకరకాల కొర్రీలతో అడ్డగోలు కోత లు పెడ్తున్నారని, ఈ విషయమై లోకల్ ఎమ్మెల్యే బాల్కసుమన్​కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగులకు, కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరారు.