ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించే కుట్ర

ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించే కుట్ర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం గుత్తాధిపత్యం ఉండాలనే కేసీఆర్ అహంకారం మరోసారి బట్టబయలైందని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి చెప్పారు. భూ కబ్జాల ఆరోపణల పేరుతో మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ను కేసుల్లో ఇరికించి, మంత్రి పదవి నుంచి తొలిగించేందుకు కుట్ర పన్నారన్నారు. రాష్ట్ర సాధన పోరాటంలో పని చేసిన ఉద్యమ నాయకులను తనకు అడ్డు లేకుండా చేసుకోవడం కేసీఆర్‌‌‌‌కు కొత్తేం కాదని అన్నారు. నియంతృత్వ పోకడతో సొంత పార్టీ నేతలు గొంతెత్తకుండా అణచివేస్తున్నారని ఆరోపించారు. ఈ నీచమైన కుట్రలో భాగంగానే ఇప్పుడు ఈటలను బలి చేస్తున్నారని, వ్యక్తిత్వాన్ని కించపరిచి ఆయనను భ్రష్టు పట్టించేందుకు దిగజారారని అన్నారు.