కాకా స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పోరాడిన : వివేక్​ వెంకటస్వామి

కాకా స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పోరాడిన : వివేక్​ వెంకటస్వామి
  • ఆయన మాటలే నాకు స్ఫూర్తి: వివేక్​ వెంకటస్వామి
  • ఇప్పుడూ ఆయన బాటలోనే నడుస్తూ అవినీతిపై కొట్లాడుతున్న
  • కాకా వర్ధంతి సందర్భంగా ట్యాంక్​బండ్​పై ఆయన విగ్రహానికి నివాళులు

హైదరాబాద్, వెలుగు: ఎవరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా ధర్మం, న్యాయం వైపే ఉండాలని తన తండ్రి గడ్డం వెంకటస్వామి(కాకా) చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమంలో పోరాడానని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో అవినీతిపై కొట్లాడుతున్నానని తెలిపారు. అందరికీ కాకా ఓ రోల్​ మోడల్​ అని చెప్పారు. గురువారం కాకా 9వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​ ట్యాంక్​బండ్​పై ఉన్న ఆయన విగ్రహానికి వివేక్​ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేక్​తోపాటు పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, ఓయూ స్టూడెంట్​ జేఏసీ నేతలు కాకాకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లను పంపిణీ చేసిన వివేక్.. మాలల అలయ్​ బలయ్​ పోస్టర్​ను ఆవిష్కరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విలువలను పాటిస్తూ కిందిస్థాయి నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన గొప్ప వ్యక్తి కాకా అని వివేక్​ అన్నారు. యూత్​ కాంగ్రెస్​ లీడర్​గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాకా.. కేంద్ర మంత్రిగా ఉన్నత స్థానాలను అందుకున్నారని చెప్పారు.

అవన్నీ కాకా చలవే

కాకా ఎన్నడూ తన స్వార్థం గురించి ఆలోచించలేదని, ప్రజల కోసమే పనిచేశారని వివేక్ అన్నారు. ప్రైవేటు కంపెనీల్లో పెన్షన్​ సిస్టం తీసుకొచ్చినా, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినా, సింగరేణిలో లక్ష మంది ఉపాధిని కాపాడినా అది కాకా ఘనతేనని అన్నారు. నాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కాకా.. ఆ శాఖ బడ్జెట్​ను రూ.5 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు పెంచేలా కృషి చేశారని తెలిపారు. రాష్ట్రంలో సివిల్​ సప్లయిస్ మంత్రిగా ఉన్నప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల కడుపు నింపారని వివేక్​ గుర్తు చేశారు. బాగ్​లింగంపల్లిలో కాకా అంబేద్కర్​ కాలేజీని ఏర్పాటు చేసి 2 లక్షల మందికిపైగా చదువును చెప్పించి ఉన్నత స్థానాల్లో నిలిపారని అన్నారు. అంబేద్కర్​ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్లు సత్తా చాటుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధిస్తున్నారని చెప్పారు. ఎల్ఎల్ఎంలో స్టేట్​ ఫస్ట్​ ర్యాంకర్.. అంబేద్కర్​ లా కాలేజీలోనే చదివారని ప్రశంసించారు. మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో అంబేద్కర్​ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, డొనేషన్లు లేకుండానే అడ్మిషన్లను ఇస్తున్నారని చెప్పారు.

తెలంగాణ కోసం సోనియా దగ్గర కొట్లాడిన్రు: జి.చెన్నయ్య

తెలంగాణ కోసం సోనియా గాంధీ దగ్గర కొట్లాడింది కాకా అని మాల మహానాడు కన్వీనర్​ జి.చెన్నయ్య అన్నారు. ఆ ఫలితంగా ఏర్పడిన తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్.. ఆ మాట తప్పి తానే సీఎం అయ్యారని విమర్శించారు. కాకా చరిత్రను పుస్తకాల్లో పాఠంగా చేర్చాలని ఓయూ స్టూడెంట్ జేఏసీ నేతలు డిమాండ్​ చేశారు.