మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణను జూన్ 2తేదీకి వాయిదా వేసింది నాంపల్లి సీబీఐ కోర్టు. మరోవైపు ఈ కేసు సంబంధించిన నిందితులను సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కూడా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అతనితో పాటుగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి , సునీల్ యాదవ్ లను సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
అటు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 27 గురువారం రోజున రద్దు చేసింది. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని ..అతను బయట ఉండటం వల్ల దర్యాప్తులో సహకరించడానికి ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు అతడి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు వివరించింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ,, వచ్చే నెల మే 5లోపు హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. సీబీఐ కోర్టులో లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చునని తెలిపింది.
2019 మార్చి 14వ తేదీ రాత్రి పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసు దర్యాప్తును ఈ ఏడాది జూన్ 30వ తేదీ లోపుగా పూర్తి చేయాలని ఇటీవలనే సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ మరింత వేగవంతం చేసింది