
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వీఆర్వో సిస్టమ్ రద్దయి ఏడాది దాటిపోయింది. కానీ, వీఆర్వోలను మాత్రం సర్కారు పట్టించుకోవడం లేదు. వీఆర్వోలుగా పనిచేసిన 5,345 మందిని పంచాయతీరాజ్ వంటి డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తామని నిరుడు సెప్టెంబర్లో సర్కారు గెజిట్ రిలీజ్ చేసినా.. ఇంతవరకు దానిపై స్పందించలేదు. అర్హతను బట్టి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లుగా వాళ్లకు ప్రమోషన్ ఇస్తామన్న ప్రకటన కూడా కేవలం మాటలకే పరిమితమైంది. దీంతో ఒక్క డిపార్ట్మెంట్ అని కాకుండా రకరకాల పనులను వీఆర్వోలతో చేయించుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్స్ పొందిన 2 వేల మంది వీఆర్వోల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయి రెండేండ్లు దాటుతున్నా రెగ్యులరైజ్ చేయలేదు. 20 ఏండ్లుగా పనిచేస్తున్నోళ్లకు ప్రమోషన్లూ రాలేదు. వేరే శాఖల ఉద్యోగులకు అందుతున్న ఇంక్రిమెంట్లు, ఇతర బెనిఫిట్ల వంటివేవీ వీఆర్వోలకు అందట్లేదు.
జాబ్ చాప్టరే లేదు
వీఆర్వో సిస్టమ్ రద్దు కాకముందు.. పల్లెల్లో రెవెన్యూ రికార్డులను దాచడం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల అమలు వంటి పనులతో వీఆర్వోలకు జాబ్ చాప్టర్ ఉండేది. ఇప్పుడు జిల్లాల్లో అక్కడి అవసరాలను బట్టి రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల అధికారులు ఎలాంటి జాబ్ చాప్టర్ లేకుండానే వేర్వేరు పనులను అప్పగిస్తున్నారు. ‘‘పెద్దాఫీసర్లకు ఏ అవసరమొచ్చినా మేమే పనిచేయాల్సి వస్తోంది. ఎవరెప్పడు పిలుస్తారో.. ఒకేసారి ఎంతమంది ఏ పనులు చెప్తారో అర్థం కావట్లేదు. పాత పహాణీలకు సంబంధించిన అనుమానాలున్నాయని ఆఫీసర్ల నుంచి ఫోన్ వస్తే అర్ధరాత్రిళ్లు కూడా వెళ్లిన సందర్భాలున్నాయి’’ అని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వీఆర్వో ‘వెలుగు’తో తన బాధను పంచుకున్నారు.
రకరకాల డ్యూటీలు
వీఆర్వోలను రకరకాల పనులకు అధికారులు వాడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వీఆర్వోలుగా పనిచేసినోళ్లకు ఎయిర్పోర్టులో డ్యూటీ వేస్తున్నారు. వంతుల వారీగా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా డ్యూటీలు ఇస్తున్నారు. అక్కడ ఇంటర్నేషనల్ ప్యాసింజర్లు కరోనా టెస్టులు చేయించుకున్నారా? లేదా? వ్యాక్సినేషన్ వంటి విషయాలను పరిశీలిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్ల దగ్గర అధికారులకు హెల్పర్లుగా పని చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూడటం, కబ్జాదారులకు నోటీసులు అందించడం వంటి పనులు చేస్తున్నారు. తహసీల్దార్కు వచ్చే వివిధ ఫిర్యాదులనూ వీళ్లే పరిశీలిస్తున్నారు. కొన్నిచోట్ల తహసీల్దార్లు, కలెక్టర్లకు మధ్య మెసెంజర్లుగా ఫైళ్లు మోస్తున్నారు.
ఊరికిపోతే అవమానం
‘‘ఏడాది నుంచి ఆఫీసర్లు మాకు వేర్వేరు పనులను చెప్తున్నారు. సిస్టమ్ రద్దయ్యాక వేరే పనులు మీద ఊళ్లకు పోతే.. ‘మీ నౌకర్ పోయింది కదా.. మళ్లెందుకొచ్చిన్రు’ అంటూ అనుమానిస్తున్నారు. కొంతమంది ఇబ్బందిగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు’’ అని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నరసింహ అనే ఓ వీఆర్వో ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రులకు ఏడాదిగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకుంటలే
మా డ్యూటీలు చెప్పాలని, డిపార్టుమెంట్ అలాట్మెంట్పై తేల్చాల్సిందిగా అధికారులను అడిగితే ‘నెలనెలా జీతాలిస్తున్నం కదా.. ఏం చెప్తే అది చేయండి’ అంటున్నరు. సమస్యలు పరిష్కరించాలని మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్ గౌడ్లు, సీఎస్ను ఏడాదిగా విజ్ఞప్తి చేస్తున్నా స్పందించట్లేదు. - వినయ్, వీఆర్వోల సంక్షేమ సంఘం నాయకుడు