
ముంబై: మనదేశంలోనే అతిపెద్ద ఓడరేవు నిర్మాణ సంస్థ, మహారాష్ట్రలోని వాధ్వాన్ వద్ద మెగా పోర్ట్ ప్రాజెక్ట్ కోసం భారీగా రూ.30 వేల కోట్ల నిధులను సమీకరించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ దేశంలోని సముద్ర మౌలిక సదుపాయాలలో కీలకంగా మారనుంది. కేంద్ర క్యాబినెట్ ఇటీవల రూ.76,220 కోట్ల అంచనా వ్యయంతో వాధ్వాన్ పోర్ట్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది.
ఇందులో రూ.30 వేల కోట్లను కోర్ పోర్ట్ మౌలిక సదుపాయాలైన బ్రేక్వాటర్స్, డ్రెడ్జింగ్, కనెక్టివిటీ వంటి వాటి కోసం కేటాయిస్తారు. మిగిలిన నిధులను ప్రైవేట్ ఆపరేటర్లు కంటైనర్ టెర్మినల్స్, బెర్త్లు, ఇతర వాణిజ్య సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిగా పెడతారు. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్పీఏ), మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ (ఎంఎంబీ) మధ్య 74:26 నిష్పత్తిలో వాటాలతో ఏర్పాటు అయిన వాధ్వాన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (వీపీపీఎల్) ఈ ప్రాజెక్ట్ను చేపట్టనుంది.
వాధ్వాన్ పోర్ట్ను ఒక ఆల్-వెదర్, గ్రీన్ ఫీల్డ్, డీప్-డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్గా అభివృద్ధి చేస్తారు. ఇది పూర్తయితే, ప్రపంచంలోని టాప్ 10 పోర్ట్లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పోర్ట్ సంవత్సరానికి 298 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) కార్గోను, 23.2 మిలియన్ ట్వంటీ- ఫుట్ ఈక్వివలెంట్ యూనిట్స్ (టీఈయూ) కంటైనర్లను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
20 వేల టీఈయూల వరకు భారీ కంటైనర్ నౌకలను కూడా ఇది నిర్వహించగలదు. ఈ భారీ ప్రాజెక్ట్ దాదాపు 12 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని వీపీపీఎల్ తెలిపింది.