
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన రిటైల్ కంపెనీ వాల్మార్ట్ తన సప్లయర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇండియాలో మరో లక్ష ఎంఎస్ఎంఈల (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ల) కు సాయం చేయనుంది. రాబోయే మూడేళ్లలో వీటికి మెంటార్షిప్, ట్రెయినింగ్ ఇవ్వనుంది. ఇందుకోసం ఐడియాస్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ (ఐ2ఐ)తో కలిసి పనిచేయనుంది.
ఎంఎస్ఎంఈలు వాల్మార్ట్ గ్లోబల్ సప్లయ్ చెయిన్, ఫ్లిప్కార్ట్ ఈ–కామర్స్ సామర్థ్యాలతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత విస్తరించడానికి వీలుంటుంది. “వాల్మార్ట్ వృద్ధి ప్రోగ్రామ్ తదుపరి దశకు సిద్ధమవుతున్న సమయంలో, మరో లక్ష ఎంఎస్ఎంఈలకు రాబోయే మూడేళ్లలో సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం ఐడియాస్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం” అని వాల్మార్ట్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సప్లయర్ డెవలప్మెంట్ - సోర్సింగ్) జాసన్ ఫ్రెమ్స్టాడ్ చెప్పారు. 2027 నాటికి వాల్మార్ట్కు ఇండియా నుంచి10 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతాయని అంచనా.
భారతీయ ఎంఎస్ఎంఈలు కీలక బిజినెస్ స్కిల్స్ పెంచుకోవడంలో, మార్కెట్ యాక్సెస్ పొందడంలో, వాల్మార్ట్ వృద్ధి సాయపడుతోంది. 2019లో లాంచ్ అయిన ఈ ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు 70,000 ఎంఎస్ఎంఈలకు డిజిటల్ కామర్స్, పర్సనలైజ్డ్ మెంటార్షిప్, స్ట్రాటజిక్ పార్టనర్షిప్స్ ద్వారా శిక్షణ ఇచ్చింది. ఇండియాలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో వాల్మార్ట్ మెక్సికోలో క్రీస్కాన్ వాల్మార్ట్, అమెరికాలో గ్రో విత్ యూఎస్ వంటి సప్లయర్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్లను లాంచ్ చేసింది.