వనపర్తి, వెలుగు : వనపర్తి మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా చైర్మన్ స్థానం ఓసీలకు దక్కలేదు. ఈసారి చైర్మన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో ఓసీలకే సీటు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ఈ సారి వనపర్తి స్థానాన్ని జనరల్కు కేటాయిస్తారని ఆశించిన కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులు ఆ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో నిరాశచెందారు.
దీంతో ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే ఎస్ఎల్ఎన్ రమేశ్తన భార్యను బరిలో నిలిపారు. ఇప్పుడు చైర్ పర్సన్ పీఠం ఆమెకే దక్కుతుందని అనుకున్నా బీసీ మహిళ, జనరల్ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన మహిళా అభ్యర్థులు తమకూ అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు.
వీరిలోనూ కాంగ్రెస్ పార్టీలో చాన్నాళ్లుగా పనిచేసినవారు ఉన్నారు. తాజాగా ఒక అభ్యర్థిని భర్త ఏకంగా చైర్ పర్సన్ స్థానాన్ని తన భార్యకు ఇవ్వకుంటే ప్రాణత్యాగానికైనా తెగిస్తానని బ్లాక్ మెయిల్కు తెరలేపినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కౌన్సిలర్లంతా క్యాంపులో ఉన్నారు. చర్చల అనంతరం క్యాంపు నుంచి సోమవారం మున్సిపాలిటీకి నేరుగా కౌన్సిలర్లు హాజరుకానున్నారు.
