మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి

వనపర్తి, వెలుగు: ప్రభుత్వం మహిళా సంక్షేమంతో పాటు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం వనపర్తిలో ఇందిర మహిళా శక్తి సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్  ఆదర్శ్  సురభి, శాట్స్​​చైర్మన్  శివసేనారెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 529 సంఘాలకు రూ.1.60 కోట్ల వడ్డీ లేని రుణాలను, ఇందిరమ్మ చీరలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని స్వయంసహాయక సంఘాలకు రుణాలు ఇస్తున్నామని తెలిపారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ వైఎస్  హయాంలో మహిళలకు పావలా వడ్డీ రుణాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్ల పాటు ప్రజలకు రేషన్  కార్డులు ఇవ్వడం కూడా మరిచిపోయిందని విమర్శించారు. ఏఎంసీ చైర్మన్​ శ్రీనివాస్ గౌడ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మాధవరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకం

జిల్లెల మాధవ రెడ్డి జీవితం నేటి సమాజానికి స్ఫూర్తి దాయకమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పట్టణంలోని పాలిటెక్నిక్​ కాలేజీ గ్రౌండ్​లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సోదరుడు మాధవరెడ్డి స్మారక ఫుట్​బాల్​ టోర్నమెంట్​ను ప్రారంభించారు.  న్యూరాలజిస్టుగా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ నిరాడంబర  జీవితం గడిపారని కొనియాడారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్స్​ చైర్మన్​ శివసేనారెడ్డి, కలెక్టర్  ఆదర్శ్  సురభి, ఫుట్ బాల్  అసోసియేషన్  జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్, లైబ్రరీ చైర్మన్  గోవర్ధన్ సాగర్, డీవైఎస్​వో సుధీర్ రెడ్డి, పీడీ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.