
20 ఏళ్లుగా పోలీసులను తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్స్టర్ ఎజాజ్ లక్డావాలాను ముంబై యాంటీ ఎక్స్టార్షన్ సెల్(AEC) పోలీసులు అరెస్ట్ చేశారు. 27 కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న అతని కోసం ముంబై, ఢిల్లీ నగరాల్లో గాలించి, చివరకి బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో పాట్నాలో అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, దోపిడీలు, హింసకు పాల్పడటం వంటి పలు ఘటనలకి సంబంధించి అతనిపై కేసులున్నాయి.
ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన పోలీసులు లక్డావాలా కూతురు సోనియా లక్డావాలాను కూడా మంగళవారం అరెస్ట్ చేశారు. తండ్రి ఆదేశాల మేరకు ఆమె డబ్బు కోసం ఓ రియల్టర్ ను బెదిరించినట్టు, దోపిడికి కూడా పాల్పడినట్టు తెలియడంతో అదుపులోకి తీసుకున్నామని క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమీషనర్ సంతోష్ రాస్తోగి తెలిపారు. తన తండ్రి గురించి సోనియా ఇచ్చిన సమాచారం మరియు పాట్నాలో ఎజాజ్ లక్డావాలా ఉన్నట్టు పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం రావడంతో అతని పట్టుకున్నామని సంతోష్ చెప్పారు.
ఎజాజ్ లాక్డావాలా మొదట్లో గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్లో ఉన్నాడు. ఆ తరువాత అతనితో విడిపోయి ఛోటా రాజన్ గ్యాంగ్లో చేరాడు.